ఫిల్మ్ డెస్క్- సాయి పల్లవి.. ఈ స్టార్ హీరోయిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లామర్ షో కాకుండా కేవలం నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది సాయి పల్లవి. తెలుగులోనే కాదు దక్షిణాది సినీ పరిశ్రమలో సాయి పల్లవికి మంచి డిమాండ్ ఉంది. స్టార్ హీరోలు సైతం సాయి పల్లవి డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు.
సాయి పల్లవికి తమ సినిమాలో నటిస్తుందంటే చాలు ఆ సినిమా సగం హిట్టైనట్టేనని నిర్మాతలు, హీరోలు భావిస్తున్నారట. మొన్నా మధ్య రీమేక్ సినిమా అని చిరంజీవి పక్కన నటించే చాన్స్ ను కూడా వదులుకుంది సాయి పల్లవి. ఇక కోట్ల రూపాయలు ఇస్తామన్నా కుడా యాడ్స్ మాత్రం చేయడం లేదు. ఏ మాత్రం అందాలు ఆరబోయకుండా కేవలం అభినయంతో స్టార్ హీరోయిన్ గా రాణించడం ఆశామాషి కాదు. అందుకే సాయి పల్లవి అంటే అంత క్రేజ్ మరి.
ఇక అసలు విషయానికి వస్తే సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టేసింది. సాయి పల్లవి, పూజా కన్నన్ ఇద్దరూ చూసేందుకు ఒకేలా కనిపిస్తున్నారు. పూజా కన్నన్ సినీ ఎంట్రీ గురించి గతంలో చాలా ప్రచారం జరిగింది. అవన్నీ నిజం చేస్తూ పూాజా కన్నన్ ఎట్టకేలకు సినీ అరంగేట్రం చేసేసింది. పూజా సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. తమిళ స్టంట్ డైరెక్టర్ సిల్వ దర్శకుడిగా మారి చిత్తారాయి సెవ్వనం అనే సినిమా రూపొందింది.
ఈ మూవీలో ప్రముఖ నటుడు సముద్రఖని, పూజా కన్నన్ ప్రముఖ పాత్రల్లో నటించారు. తాజాగా సముద్రఖని, పూజా కన్నన్ మీద పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఐతే ఈ సినిమా ధియేటర్స్ లో రిలీజ్ కావడం లేదు. నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 3న జీ5 లో పూజా కన్నన్ నటించిన చిత్తారాయి సెవ్వనం రాబోతోంది. ఏదేమైనా సాయి పల్లవిలా పూజా కన్నన్ కూడా అందరినీ మెప్పిస్తుందా లేదా అన్నది ముందు ముందు తేలనుంది.