అనంతపురం- సాధారనంగా అంతా కారెక్కాలనుకుంటారు. లేదంటే ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఆటో ఎక్కాలనుకుంటారు. కానీ ఓ ఆటోనే కారెక్కేసింది. అదేంటీ ఆటో కారెక్కడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. అవునండీ బాబు.. ప్యాసింజర్ ను ఎక్కించుకోవాల్సిన ఆటో, ఏకంగా కారునే ఎక్కేసింది. అసలేం జరిగిందంటే.. ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయో వేరే చెప్పక్కర్లేదు.
ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాల గురించే వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురవ్వడంతో ఆయన తీవ్ర గాయాలపాలవ్వడం మనందరికి తెలిసింది. ఇదిగో ఇంతలోనే ఇప్పుడు అనంతపురంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికంగా ఒక ఇన్నోవా కారు బీభత్సం సృష్టించింది. అనంతపురం శివారులోని టీవీ టవర్ దగ్గర వేగంగా వచ్చిన ఓ ఇన్నోవా కారు రెండు పాసింజర్ ఆటోలను ఢీకొట్టింది.
ప్రమాద ధాటికి ఒక ఆటో తలకిందులవగా, మరో ఆటో కారు బోనెట్ పైకి ఎక్కేసింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారు భయబ్రాంతులకు గురయ్యారు. ఎక్కడి వారు అక్కడి నుంచి పరుగులు తీశారు. అసలు కాసేపు ఏంజరిగిందే ఎవ్వరికి అర్ధం కాలేదు. తేరుకున్నాక చూస్తే మాత్రం ఓ ఆటో ఇన్నోవా కారుపైకి ఎక్కేసి ఉంది. ఈ ప్రమాదంలో ఐదుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఐదుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు కారుతో పాటు రెండు ఆటోలను స్టేషన్కు తరలించారు. కారు డ్రైవర్పై కేసు నమోదు చేశారు. ఓవర్ స్పీడ్ ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. కారుపైకి ఆటో ఎక్కడాన్ని చూసి అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు.