హైదరాబాద్- తెలంగాణలో వరిధాన్యం కొనుగోలుకు సంబందించి కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనంటూ మోదీ సర్కార్ పై యుధ్దానికి సిద్ధమైన సీఎం కేసీఆర్ స్వయంగా హైదరాబాద్ లో ఆందోళనలో పాల్గొని సంచలనం రేపారు. అంతే కాదు ఏకంగాా మంత్రులు, అధికారులతో కలసి ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.
ఐతే ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ మాత్రం దొరకలేదు. దీంతో మోదీని కలవకుండానే కేసీఆర్ హైదరాబాద్ వచ్చేశారు. ఇటువంటి సమయంలో తెలంగామ సీఎం కేసీఆర్ రైతు అజెండాపై ఢిల్లీ రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ సంచల వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతు ఉద్యమం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేశారు.
ఈ ధర్నాలో ఢిల్లీ రైతు ఉద్యమ కీలక నేత, సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు రాకేష్ టికాయత్ సహా పలువురు ఉద్యమ నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మూడు సాగు చట్టాల రద్దును పార్లమెంట్ లో ఆమోదించాలని టికాయత్ డిమాండ్ చేశారు. అంతే కాదు కనీస మద్దతు ధరల గ్యారెంటీ బిల్లును సైతం పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని ఆయన అన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్ ప్రభుత్వంపై రైతు ఉద్యమ నేత టికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ధాన్యం సేకరణలో కేసీఆర్ ప్రభుత్వ తీరు సరిగ్గా లేదని ఆయన అన్నారు.
సీఎం కేసీఆర్ కూడా రైతు వ్యతిరేకి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని టికాయత్ ఆరోపించారు. రైతు ఉద్యమంపై తెలంగాణ ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీకి తెలంగాణలో టీఆర్ ఎస్ బీ టీంగా పనిచేస్తోందని టికాయత్ ఆరోపించారు.