కూకట్పల్లి భగత్సింగ్ నగర్లో ఇంజినీరింగ్ చేసిన ప్రశాంత్కు 2010లో బెంగళూరులో ఉద్యోగం చేశాడు. ఆ సమయంలో అక్కడ మధ్యప్రదేశ్కు చెందిన యువతి స్వప్నిక పాండే పరిచయమైంది. ఈ క్రమంలో ప్రశాంత్ ఆమెను ప్రేమించాడు. మూడేళ్లు కలసి పనిచేసినా ఆ మాట ఆమెకు చెప్పలేకపోయాడు. 2013లో ఉద్యోగ రీత్యా బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చినా ఆమె వద్దకు వెళ్లాలని ప్రయత్నించాడు. ఈ లోపు యువతి బెంగళూరు నుంచి వెళ్లిపోవడంతో నేరుగా మధ్యప్రదేశ్లోని ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ప్రేమ విషయం చెప్పాడు. వారి నుంచి ప్రతికూల సమాధానం రావడంతో ఆ యువతి స్విట్జర్లాండ్లో ఉన్నట్టు తెలుసుకొని అక్కడికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు.
2017 ఏప్రిల్ 11న కార్యాలయానికి వెళ్తున్నానని తల్లికి చెప్పిన ప్రశాంత్ స్విట్జర్లాండ్ బయలుదేరాడు. పాకిస్థాన్ మీదుగా వెళ్తే స్విట్జర్లాండ్ 8,400 కి.మీ దూరం వస్తుందని గూగుల్ మ్యాప్లో గుర్తించి, రెండు ప్రింట్లు తీసుకొని ఫోను, పర్సు కూడా ఇంట్లోనే వదిలేసి సికింద్రాబాద్ చేరాడు. టిక్కెట్టు లేకుండా రైలు ద్వారా రాజస్థాన్లోని బికనీర్ వెళ్లాడు. అక్కడి నుంచి కాలినడకన వెళ్లి ఏప్రిల్ 13న భారత్-పాక్ సరిహద్దులోని రక్షణ కంచె దాటి పాక్లోకి ప్రవేశించాడు. అప్పటికే తీవ్రంగా అలసిపోయిన ప్రశాంత్ సమీపంలోని ఓ గుడిసెలో స్పృహ తప్పి పడిపోయాడు. రక్షణ కంచె దాటే క్రమంలో ప్రశాంత్ చొక్కా చిరిగి ఓ పీలిక దానికి చిక్కుకోవడంతో అది గమనించిన పాక్ సరిహద్దు భద్రతా బలగాలు ఏప్రిల్ 14న అదుపులోకి తీసుకున్నాయి. వెంటనే లాహోర్లోని సైనిక కేంద్రానికి తరలించాయి. తమదైన శైలిలో అతడి వివరాలు సేకరించి, సాధారణ పౌరుడిగా నిర్ధారించుకొని రెండు-రెండున్నరేళ్ల తరువాత ఆ దేశ చట్టాల ప్రకారం స్థానిక కోర్టులో హాజరుపరిచాయి. కోర్టు ఏడాదిపాటు జైలు శిక్ష విధించడంతో పోలీసులు కోట్ లాక్పాట్ జైలుకు తరలించారు. ప్రశాంత్ తల్లిదండ్రులు సైబరాబాద్ సీపీ సజ్జనార్ను కలసి తమ కుమారుడిని సురక్షితంగా ఇల్లు చేర్చాలని కోరారు. సజ్జనార్ స్వయంగా దిల్లీ వెళ్లి విషయాన్ని కేంద్ర హోంశాఖకు వివరించడంతో అతన్ని భారత్కు తీసుకొచ్చే ప్రక్రియ మొదలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రయత్నం ఫలించింది. పాకిస్థాన్ జైలు నుంచి విడుదలైన ఆ యువకుడిని మే 31న పంజాబ్ అట్టారి పోలీస్స్టేషన్కు చేర్చారు. అక్కడ అతడిని మాదాపూర్ ఇన్స్పెక్టర్ పి.రవీంద్రప్రసాద్ అప్పగించారు. అతని స్వగ్రామం వైజాగ్ పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.