ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీ పాటల రచయిత అనంత్ శ్రీరాం వివాదంలో చిక్కుకున్నారు. ఈ మధ్య ఆయన రాసిన ఓ పాటపై వివాదం చలరేగుతోంది. దీంతో అనంత్ శ్రీరాంపై ఆంధ్రప్రదేశ్ లో పోలీసు కేసు నమోదైంది. అనంత్ శ్రీరామ్ రాసిన పాట హిందూ దేవుళ్లను కించ పరిచేదిగా ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నాగశౌర్య, రీతూ వర్మలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న వరుడు కావలెను సినిమా కోసం అనంత్ శ్రీరాం ‘దిగు దిగు దిగు నాగ’ అనే పాటను రాశారు. ఈ పాటను చిత్ర యూనిట్ ఈ మధ్యనే విడుదల చేసింది. పెళ్లిచూపులు ఫేం రీతూ వర్మ నటించిన ఈ పాట యూట్యూబ్ లో దూసుకుపోతోంది. అయితే ఈ పాట హిందువు మనోభావాలను దెబ్బతీసేలా ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బిందూ రెడ్డి ఆరోపిస్తున్నారు.
హిందువులు భక్తితో కొలిచే నాగ దేవతను కించపరిచేలా పాటను రచించిన అనంత శ్రీరామ్పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ పాట రాసిన అనంత్ శ్రీరామ్తో పాటు వరుడు కావలెను మూవీ యూనిట్పై చర్యలు తీసుకోవాలని నెల్లూరులోని చిల్లకూరు పోలీస్ స్టేషన్లో బిందూ రెడ్డి ఫిర్యాదు చేశారు. అంతే కాదు అనంత శ్రీరామ్పై బ్రాహ్మణ సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
నాగదేవతపై ఒరిజినల్ గా ఉన్న జానపద పాటలో ఉన్న అద్భుతమైన భావాన్ని పాడు చేసి, హిందువుల మనోభావాలను కించపరిచారని వారు మండిపడ్డారు. వెంటనే సినిమా నుంచి ఈ పాటను తొలగించాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి.