ఇవాళ సాయంత్రం అయిదు గంటలకు మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఈ నేపథ్యంలో మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా లాక్డౌన్ సడలింపులు, కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై కీలక ప్రకటన చేసే అవకాశముంది. మునుపటితో పోల్చితే అనేక రాష్ట్రాలు ‘అన్ లాక్’ ప్రక్రియకు తెరదీశాయి. ప్రధానంగా వ్యాక్సినేషన్ అంశంపైనా ఆయన దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ నివారణలో వ్యాక్సిన్లు ఎంత కీలకపాత్ర పోషిస్తాయన్నది వివరించే అవకాశాలున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియపై దేశవ్యాప్తంగా భారీ ఎత్తున విమర్శలు వస్తుండటంతో మోదీ ముఖ్యంగా దీనిపై మాట్లాడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
వ్యాక్సినేషన్ అంశంలో తమ ప్రభుత్వ పాలసీని మోదీ మరోసారి ప్రజలకు వివరించనున్నట్లు సమాచారం. కోవిడ్ ఉధృతంగా ఉన్న సమయంలో దేశంలో వ్యాక్సిన్లకు తీవ్ర కొరత తలెత్తిన సంగతి తెలిసిందే. దాంతో ప్రభుత్వం ‘‘వ్యాక్సిన్ మైత్రి’’ కార్యక్రామనికి కొంత కాలం పాటు విరామం ఇచ్చింది. దేశ ప్రజలందరికి సరిపడా వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురావడం కోసం ఎక్కువ మొత్తంలో టీకాలను సేకరించడం ప్రాంరభించింది. దేశంలో కరోనా కట్టడిపై ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు ఏవిధంగా ఉన్నాయి. ఎలాంటి సత్ఫలితాలనిచ్చాయనే విషయాలను మోదీ తన ప్రసంగంలో ప్రస్తవించనున్నట్లు సమాచారం. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనేక విషయాలు చర్చించారు. ఎలాంటి పరిస్థితుల్లో దేశంలో లాక్డౌన్ అమలు చేస్తున్నామనేది ప్రధాని తన ప్రసంగం ద్వారా నేడు ప్రజలకు వివరించే అవకశాముంది. వైద్యపరంగా ఇప్పటి వరకు వచ్చిన అంశాలన్నింటినీ పరిశీలిస్తున్నామని చెప్పటంతో పాటు దేశ ప్రజల నుంచి కూడా పలు సూచనలు, సలహాలు కోరే ఆస్కారం కనిపిస్తోంది. లాక్డౌన్ -3 కొనసాగించాలా? కొనసాగిస్తే ఎక్కడెక్కడ కొనసాగించాలి? ఈ అంశాలపై ప్రధాని ప్రసంగంలో స్పష్టత ఇచ్చే అవకాశముంది.