పెద్దపల్లి- సమాజంలో అరాచకాలు పెరిగిపోతున్నాయి. అందులోను అమ్మాయిలు, మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తెచ్చినా, దుర్మార్గుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఓ యువతి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో రెండు నెలలుగా సహజీవనం చేశాడో యువకుడు. తీరా పెళ్లి చేసుకోమని అడగడంతో ఆ యువకుడు నిరాకరించడంతో బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది.
ఈ ఘటన పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో చోటుచేసుకుంది. పాలకుర్తి మండలం జయ్యారం గ్రామానికి చెందిన యువతిది నిరు పేద కుటుంబం. ఆమెకు దూరపు బంధువులైన అప్పన్నపేటకు చెందిన సురేష్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. సురేష్ కుటుంబసభ్యులు కూడా వీరి పెళ్లికి ఒప్పుకోవడంతో ఆ యువతిని తనింటికి తీసుకొచ్చాడు.
ఈ క్రమంలో రెండు నెలలుగా సురేష్ ఆ యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నాడా యువకుడు. దీంతో ఆదివారం యువతి అతన్ని నిలదీసింది. పెళ్లి విషయంలో సురేష్ మాట దాటవేయడంతో మోసపోయానని గ్రహించిన యువతి రెండ్రోజుల క్రితం బసంత్ నగర్ పోలీసులను ఆశ్రయించింది.
ఆ తరువాత కుటుంబ సభ్యులతో గొడవ జరగడంతో మనస్థాపం చెందిన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అది గమనించిన బంధువులు పెద్దపల్లి ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో యువతిని మెరుగైన వైద్యం కోసం కరీంనగర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.