ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తున్న వేళ విజయవాడ రైల్వే ఆసుపత్రిలో వెయ్యి కిలోలీటర్లకు పైగా ఆక్సిజన్ వృథా అయింది. ఆటోనగర్లో ఉన్న ఫణి గ్రీష్మ ఏజెన్సీ నుంచి రైల్వే ఆసుపత్రికి ప్రతి రోజూ వెయ్యి కిలోలీటర్ల ఆక్సిజన్ సరఫరా అవుతుంటుంది. నిన్న కూడా ఓ ట్యాంకర్ ఆక్సిజన్ మోసుకొచ్చింది. దూరాల నుంచి రావాల్సిన ట్యాంకర్లు ఆలస్యమయితే ఆస్పత్రుల్లో టెన్షన్ మొదలయిపోతోంది. కొందరి నిర్లక్ష్యం విలువైన ప్రాణవాయువును సైతం పీల్చిపిప్పి చేస్తోంది. చూస్తుండగానే లీటర్ల లీటర్ల ఆక్సిజన్ గాలో కలిసిపోయింది… ట్యాంక్లోని ఆక్సిజన్ వృథా అయింది.
బుధవారం కూడా ఆక్సిజన్ ట్యాంకర్ వచ్చింది. ట్యాంకర్లోని ఆక్సిజన్ను ఫిల్లింగ్ చేస్తుండగా ఆస్పత్రి ట్యాంక్లో ఏర్పడిన లీక్తో అదంతా బయటకు ఎగసిపడింది. రైల్వే ఆస్పత్రి ప్రాంగణాన్ని దట్టంగా కమ్మేసింది. ఈ దృశ్యాన్ని చూసిన కొంతమంది భయంతో పరుగులుపెట్టారు. అయితే, నిర్వాహకుల పొరపాటు కారణంగానే ఆక్సిజన్ లీకైందని వైద్యులు తెలిపారు. అయితే, తమ వద్ద అదనంగా ఆక్సిజన్ నిల్వలతోపాటు, కాన్సంట్రేటర్లు కూడా ఉండటం వలన రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని వివరించారు. ఈ ఘటనపై విచారణకు డివిజనల్ రైల్వే మేనేజర్ ఆదేశించారు.