ఇంటర్నేషనల్ డెస్క్- అంతరిక్ష యాత్ర.. ఒకప్పుడు ఇది కేవలం కల మాత్రమే. కానీ ఇప్పుడు అంతరిక్ష యాత్ర సాకారమైన కల. ఐతే ఇప్పటివరకు కేవలం వ్యామోగాములు మాత్రమే అంతరిక్షానికి వెళ్లేవారు. కానీ తాజాగా వ్యామోగాములు లేకుండే, కేవలం పర్యాటకులు మాత్రమే అంతరిక్షానికి వెళ్లి వచ్చి రికార్డు సృష్టించారు. పూర్తిగా ప్రైవేటు వ్యక్తులతో మొట్టమొదటి సారి చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తయ్యింది. మూడు రోజుల పాటు రోదసిలో గడిపిన నలుగురు యాత్రికులు ఆదివారం క్షేమంగా భూమికి తిరిగొచ్చారు.
అమెరికా అంతరిక్ష ప్రైవేట్ పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో నలుగురు యాత్రికులు బుధవారం రాత్రి అమెరికాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి పయనమయ్యారు. ప్రపంచ కుబేరుడు జేర్డ్ ఇసాక్మన్ నేతృత్వంలో హేలీ ఆర్సినో, క్రిస్ సెంబ్రోస్కీ, సియాన్ ప్రాక్టర్లు అంతరిక్షానికి వెళ్లారు. ఈ యాత్రకు అయిన ఖర్చు మొత్తాన్నీ ఇజాక్మన్ భరించారు. జేర్డ్ ఇసాక్మన్ ఈ వ్యామోనౌకకు కమాండర్గా వ్యవహరించారు.
భూ ఉపరితలం నుంచి 575 కిలోమీటర్ల ఎత్తున సర్కులర్ ఆర్బిట్లోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, హబుల్ స్పేస్ టెలిస్కోప్ పరిధి దాటి మరింత ఎత్తున మూడు రోజులు పాటు గడిపారు. తిరిగి భూమికి చేరుకునే సమయంలో సముద్ర జలాలను తాకడానికి ముందు క్రూ డ్రాగన్లోని నాలుగు పారాచూట్లు విచ్చుకుని, వేగాన్ని తగ్గించాయి. మెల్లగా వ్యోమనౌక సముద్రంలో దిగింది. దాదాపు గంట తరువాత వ్యోమనౌకను సముద్రం నుంచి వెలికితీశారు.
క్రూ డ్రాగన్ తెరుచుకున్నాక, చిరునవ్వులు చిందిస్తూ ఆర్సినో తొలుత బయటకు రాగా, తర్వాత మిగతా ముగ్గురు బయటకు వచ్చారు. ఫ్లోరిడా తీరానికి చేరువలో అట్లాంటిక్ మహాసముద్ర జలాల్లో నౌక క్షేమంగా దిగినట్టు స్పేస్ఎక్స్ సంస్థ వెల్లడించింది. పూర్తిస్థాయి వ్యోమగాముల సహకారం లేకుండానే పర్యాటకులు భూ కక్ష్యలో పరిభ్రమించి రావడం ఇదే మొదటిసారి.
1969లో అపోలో-9 యాత్ర తర్వాత ఒక వ్యోమనౌక అట్లాంటిక్ మహాసముద్రంలో దిగడం ఇదే తొలిసారి కాగా, ఓ నల్లజాతీయ మహిళను ఈ స్పేస్ క్రాఫ్ట్ పైలెట్గా నియమించడం ఇదే మొదటిసారి. వ్యోమనౌక ఆర్బిట్ నుంచి భూకక్ష్యలోకి చేరే క్రమంలో దాని వెలుపల ఉన్న ఉష్ణోగ్రతలు 3,500 డిగ్రీల ఫారెన్హీట్కి చేరుకుంది. అయితే, క్యాబిన్ వేడిక్కితే వ్యోమగాముల ఫ్లైట్ సూట్లు చల్లగా ఉండేలా ప్రత్యేక వ్యవస్థలను రూపొందించారు.