మనిషికి చదువు చాలా ముఖ్యం. అయితే స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన కూడా నేటికి మన దేశంలో అందరికి విద్య అనేది అందని ద్రాక్షలానే ఉంది. పేదరికం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక మధ్యలోనే చదువు ఆపేసేవారు నేటికి కూడా చాలా మంది ఉన్నారు. అయితే మనిషికి చదువు ముఖ్యమే కానీ.. ప్రతిభకు చదువు, డిగ్రీలే కొలమానం కాదు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా మంది నిరూపించారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ఆ యువకుడు.. ఆర్థిక పరిస్థితి అనుకూలించక ఐదో తరగతిలోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. వ్యాపారం చేశాడు. విజయవంతం అయ్యాడు. కానీ ఏదో సాధించాలని తపించిపోయేవాడు. ఈ క్రమంలో తండ్రి మాటతో స్ఫూర్తి పొంది.. సొంతంగా హెలికాప్టర్ తయారు చేసి.. ప్రతిభకు చదువుతో పని లేదని నిరూపించాడు.
ఆ వివరాలు.. పశ్చిమబెంగాల్ తూర్పు బర్ధమాన్ జిల్లా ఘోలా ప్రాంతానికి చెందిన రెజాల్ షేక్.. ఆర్థిక కష్టాల వల్ల ఐదో తరగతిలోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత తండ్రి చేసే ఆర్కెస్ట్రా టీం బాధ్యతలు చూసుకునేవాడు. అంతేకాక పొక్లెయిన్ వ్యాపార కూడా ప్రారంభించాడు. విజయంవంతంగా రాణించాడు. అయితే ఓ సందర్భంలో తండ్రి చెప్పిన మాటలు అతడిలో కసి పెంచాయి.
ఓ సందర్భంలో రెజాల్ షేక్ తండ్రి అతడితో ఇలా చెప్పాడు.. జీవితంలో ఎంత డబ్బు సాధించినా.. సరే.. ఏదైనా ప్రత్యేకంగా చేస్తేనే గుర్తింపు లభిస్తుంది అన్నారు. ఆ మాటలు రెజాల్ మనసులో కసి పెంచాయి. ఈ క్రమంలో అతడికో ఆలోచన వచ్చింది. దాన్ని ఆచరణలో పెట్టి విజయం సాధించాడు. ఈ క్రమంలో స్వయంగా హెలికాప్టర్ తయారు చేశాడు. ఇందుకోసం 32 లక్షలు ఖర్చు చేశాడు. అతడి ప్రయోగం విజయవంతం అయ్యింది.
ఈ సందర్భంగా రెజాల్ మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పుడు ఆర్థిక పరిస్థితి అనుకూలించక చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఇక మా నాన్న చెప్పిన మాటలతో స్ఫూర్తి పొంది ఈ ప్రయోగం చేశాను. ఇక హెలికాప్టర్ తయారికి 32 లక్షలు ఖర్చు చేశాను. కోల్కతా, పానాగఢ్ల నుంచి పరికరాలు, కర్ణాటక నుంచి ఇంజీన్ తెప్పించుకున్నాను. హెలికాప్టర్ నిర్మాణం పూర్తయ్యింది. ఐదుగురు కూర్చునేందుకు వీలుగా ఉంది. అయితే ఇది ప్రయాణికులు కోసం కాదు.. భారీ వస్తువులు రవాణాకు వీలుగా ఉండేలా తయారు చేశాను. మరో ఆర్నెళ్లలో మిగతా పనులన్నీ పూర్తయి.. ఆకాశంలోకి ఎగిరేందుకు అనుమతులు వస్తాయిని’’ రెజాల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. మరి రెజాల్ ప్రతిభపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.