రోడ్డు పక్కన, గుడి ముందు కూర్చుని.. దీనంగా ముఖం పెట్టి.. బాబు ధర్మం అనే వారి ముఖం చూడగానే.. పాపం ఎన్ని రోజులు అయ్యిందో వీరు భోజనం చేసి పాపం అని జాలిపడి తోచిన కాడికి దానం చేసేవారు ఎందరో ఉన్నారు. ఇలా భిక్షాటన చేసే వారిలో వికలాంగులు, వృద్ధులు, చిన్నారులే కాక.. యుక్తవయసులో ఉండి.. ఏ వైకల్యం లేని వారు కూడా ఉంటారు. ఏమైనా పని చేసుకుని బతకొచ్చు కదా అని చెప్పినా వారు వినరు, మానరు. రోడ్ల వెంట తిరుగుతూ ఇలా భిక్షాటన చేస్తూ రోజులు వెళ్లదీస్తారు. పోని నిజంగానే వీరికి తిండి దొరక్క, ఉండటానికి ఇళ్లు లేక ఇలా రోడ్ల వెంబడి భిక్షాటన చేస్తున్నారా అంటే అది కాదు.
వీరిలో చాలామంది కుటుంబాలు ఆర్థికంగా చాలా మెరుగైన స్థితిలో ఉంటాయి. అయినా సరే వీరు మాత్రం అదే చింపిరి జుట్టు, చిరిగిన బట్టలతో.. కనిపించిన వారి ముందు చేయి చాపి.. భిక్షం ఎత్తుకుంటూ గడిపేస్తారు. ఇక ఇలా భిక్షాటన ద్వారా లక్షలు ఆర్జించే వారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ భిక్షగాడు అర్థంతరంగా మృతి చెందాడు. ఇక అతడి ఖాతాలో దాదాపు 70 లక్షల నగదు ఉన్నట్లు బ్యాంకు అధికారులు వెల్లడించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాలు..
ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ప్రయాగ్రాజ్కు చెందిన ధీరజ్ అన్యే వ్యక్తి స్థానికంగా ఉన్న కుష్టు వ్యాధి ఆస్పత్రిలో స్వీపర్గా పని చేసేవాడు. దాంతో పాటు.. భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీసేవాడు. తండ్రి మరణం తర్వాత స్వీపర్ ఉద్యోగం ధీరజ్కు వచ్చింది. తల్లితో కలిసి నివసించే ధీరజ్.. ఆమెకు వచ్చే పెన్షన్ డబ్బులు, తాను భిక్షాటన చేస్తూ సంపాందించిన మొత్తంతో కాలం వెళ్లదీసేవాడు. స్వీపర్ ఉద్యోగానికి వచ్చే డబ్బులను బ్యాంకు ఖాతాలోనే ఉంచేవాడు. దాన్నుంచి ఒక్క రూపాయి కూడా తీయలేదు. పదేళ్లుగా అకౌంట్ నుంచి ఒక్క రూపాయి డ్రా చేయలేదు ధీరజ్. అలా ఇప్పుడు అతడి అకౌంట్లో రూ.70 లక్షలు ఉంది. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ధీరజ్.. ప్రతి ఏటా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవాడు.
ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున అనూహ్యంగా ధీరజ్ మృతి చెందాడు. క్షయ వ్యాధితో బాధపడుతూ కన్ను మూశాడు. ఆఖరికి అనారోగ్యంగాతో బాధపడుతున్నప్పుడైనా సరే అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసి వైద్యం చేయించుకోలేదు ధీరజ్. అకౌంట్లో ఏకంగా 70 లక్షల రూపాయలు ఉన్నప్పటికి తీవ్రమైన అస్వస్థతతో కన్ను మూశాడు. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు ఇదేం బుద్ధి.. వేరే వాళ్లకు పెట్టలేదు సరే.. తన కోసం అయినా ఖర్చు పెట్టుకోకూడదా.. ఇప్పుడు అంత డబ్బు ఉండి ఏం లాభం.. ఎవరు తింటారు అని ప్రశ్నిస్తున్నారు.
తండ్రి కూడా ఇలానే..
ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే.. ధీరజ్ తండ్రి కూడా ఇలానే చేసేవాడట. తన జీతం డబ్బును వాడకుండా.. రోడ్డుపై భిక్షాటన చేసుకుంటూ జీవించేవాడు. అదే అలవాటు ధీరజ్కు వచ్చింది. భిక్షాటన చేయగా వచ్చిన డబ్బు, 80 ఏళ్ల తన తల్లికి వచ్చిన పెన్షన్ డబ్బులతో ఇద్దరు కాలం గడిపేవారు. ప్రతి నెలా వచ్చిన జీతం డబ్బును అకౌంట్ నుంచి డ్రా చేయకపోవడంతో.. అవి ఏకంగా లక్షలాది రూపాయలు అయ్యాయి. ఆ డబ్బు గురించి కొన్ని నెలల కిందట ఐటీ అధికారులు ధీరజ్ని ప్రశ్నించారు. అతడు చెప్పిన సమాధానంతో వారు వదిలేశారు. అప్పుడు కూడా ధీరజ్ వార్తల్లో నిలిచాడు. జీతంలో పైసా కూడా తీయని వ్యక్తిగా సంచలనం సృష్టించాడు.
మరో ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే.. తన దగ్గర ఉన్న డబ్బు గురించి భయపడి.. అతడు పెళ్లి చేసుకోలేదు. వచ్చే మహిళ తన దగ్గర ఉన్న డబ్బుతో పారిపోతుందేమో అని భయపడ్డ ధీరజ్ పెళ్లి వద్దనుకున్నాడు. తల్లితో కలిసి నివసిస్తున్నాడు. అయితే ఇంత డబ్బు కూడబెట్టినప్పటికి.. దురదృష్టవశాత్తు ఆదివారం కన్నుమూశాడు. ధీరజ్ చనిపోయాక అతడి బ్యాంకు ఖాతాలో రూ.70 లక్షలు ఉన్నట్లు తెలిసిందని స్నేహితుడు వెల్లడించాడు. దీని గురించి తెలిసిన వారు.. జీతం డబ్బు దాచిపెట్టి.. జీవితమంతా భిక్షాటన మీద బతికి.. ఆఖరికి ఇలా కన్నుమూశాడు. తాను తినలేదు.. తల్లికి పెట్టలేదు.. ప్రభుత్వం పాలు చేశాడు అంటున్నారు ఈ వార్త తెలిసిన వారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.