అగ్నిపథ్ పై దేశ వ్యాప్తంగా నిరసనకారులు అల్లర్లకు తెగబడుతున్నారు. ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో ఆర్మీ అభ్యర్ధులు తమ నిరసనలు తెలియజేస్తున్నారు. మెల్ల మెల్లగా అగ్నిపథ్ సెగ హైదరాబాద్ ను కూడా తాకడంతో ఆర్మీ అభ్యర్ధులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి దూసుకెళ్లి ఆగి ఉన్న రైళ్లకు నిప్పు పెట్టి హింసను సృష్టించారు. ఇక భారీగా పోలీసులు మోహరిండంతో వారిపై ఆర్మీ అభ్యర్ధులు రాళ్లతో దాడి చేశారు. దీంతో ధీటుగా స్పందించిన పోలీసులు నిరసనకారులపై కాల్పులకు దిగారు. ఈ దాడిలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
అయితే దేశ వ్యాప్తంగా అగ్గిరాజేస్తున్న అగ్నిపథ్ నిరసనలపై తాజాగా స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన కామెంట్స్ చేశారు. అగ్నిపథ్ వంటి పథకాలు అనేక దేశాల్లో ఉన్నాయి. అగ్నిపథ్ విషయంలో యువతను తప్పుదారి పట్టిస్తున్నారు, ఇది మంచిది కాదు. సికింద్రాబాద్ ఘటన పథకం పక్కా ప్లాన్ ప్రకారమే కుట్రచేసి హింసను సృష్టించారు. ఇది బలవంతపు ట్రైనింగ్ కాదు, స్వచ్చందంగా సైన్యంలో చేరవచ్చు. యువతలో దేశభక్తి, నైపుణ్యం పెంచే ప్రయత్నమే ఇదే. జాతీయభావం తీసుకురావడంలో భాగంగా అగ్నిపథ్ను తీసుకువచ్చాము.
ఇది కూడా చదవండి: Secunderabad Railway Station: సికింద్రాబాద్ అల్లర్లలో షాకింగ్ ట్విస్ట్! అల్లర్ల వెనుక మాస్టర్ ప్లాన్?
అగ్నిపథ్ యువతకు వ్యతిరేకం కాదు, కుట్రపూరితంగానే అగ్నిపథ్పై విష ప్రచారం చేస్తున్నారు. అయితే సికింద్రాబాద్ అల్లర్ల గురించి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ప్రచారం అవుతుందని, వీటిపై ముందస్తుగా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎక్కడో అనుమానమొస్తే అరెస్ట్ చేసే పోలీసులు ఇక్కడే జరగబోయే హింసను ఎందుకు గ్రహించలేకపోయారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిపథ్ అల్లర్లపై కిషన్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.