కోట్లు ఖర్చుపెట్టి చేపట్టిన నిర్మాణాలు కొన్నిసార్లు మన కళ్ల ముందే కుప్పకూలిపోతుంటాయి. భారీ వర్షాలు పడినపుడు వరదనీటి ఉధృతికి కాల్వలకు గండి పడటం, వంతెనలు కూలిపోవడం లాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. కాలం చెల్లిపోయి రోడ్లు, వంతెనలు, కాల్వలు ప్రకృతి విపత్తు వల్ల కూలిపోవడం జరుగుతుంది. కొన్నిసార్లు డిజైన్ లో లోపాలు తలెత్తడం వల్ల భారీ నిర్మాణాలు తప్పనిసరి పరిస్థితిలో కూల్చివేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కుప్పకూలిన ఘటన బీహార్ లోని భాగల్ పూర్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బీహార్ లో నిర్మాణంలో ఉన్న ఒక వంతెన డిజైనింగ్ లో పలు లోపాలు ఉన్న కారణం చేత కూల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు. బీహార్ లో భాగల్ పూర్, కగడియా జిల్లాలను కలుపుతూ కొత్తగా నిర్మిస్తున్న అగువానీ – సుల్తాన్ గంజ్ వంతెన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూ. 1,717 కోట్లు కేటాయించి నిర్మిస్తున్నారు. 2015 లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శంకుస్థాపన చేసిన ఈ నిర్మాణం 2020 నాటికి పూర్తి కావాల్సి ఉన్నా.. పలు అంతరాయాల వల్ల పెండింగ్ పడుతూ వచ్చింది. ఇంతలోనే పలుమార్లు భారీ వర్షాలు పడటం.. తుఫాను రావడం వల్ల గత ఏప్రిల్లో బ్రిడ్జిలోని కొంతభాగం దెబ్బతిందని, అలాగే డిజైన్ లో లోపాలు తలెత్తడం వల్ల ఆదివారం బ్రిడ్జీని కూల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణంలో ఉండగానే రెండు భాగాలు ఒకదాని వెంట మరొకటి కుప్పకూలాయి. నదిలోకి కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఆ వంతెనకు సమీపంలో పనిచేస్తున్న గార్డు ఒకరు గల్లంతయ్యారు. ఈ క్రమంలో వంతెన కూల్చివేత తర్వాత ఎస్ పి సింగ్లా సంస్థ ఏర్పాటు చేసిన గార్డు విధులు నిర్వహిస్తుండగా కనిపించకుండా పోయాడు.. అతని ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. వంతెన నిర్మాణాన్ని కూల్చివేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి నితీశ్ మాట్లాడుతూ.. ‘ఈ వంతెన నిర్మాణ పనులు చేపట్టి సంస్థ పూర్తి బాధ్యతలు తీసుకోవాలని.. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం’ అని అన్నారు.
#Bihar a portion of under construction bridge over Ganga river collapsed today. The Aguanhighat Sultanganj bridge will connect Khagaria and Bhagalpur districts. pic.twitter.com/7DLTQszso7
— All India Radio News (@airnewsalerts) June 4, 2023