కోయంబత్తూరు, మంగళూరు పేలుళ్ల కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. కోయంబత్తూరు సిలిండర్ పేలుడికి, మంగళూరు కుక్కర్ పేలుడికి సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కోయంబత్తూరు సమీపంలోని శివాలయం వద్ద సిలిండర్ పేలుడు జరిగింది. గుడి దగ్గరకు వెళ్తుండగా కారులో సిలిండర్ పేలి ముబిన్ అనే యువకుడు మృతి చెందాడు. కోయంబత్తూరులోని నాగూర్ సమీపంలో ఒక సర్కిల్ లో బాంబుని పెట్టి రిమోట్ సహాయంతో పేల్చాలని అనుకున్నారు. అయితే నాగూర్ బస్టాండ్ కి చేరుకునే క్రమంలోనే బాంబు పేలిపోయింది. ఇలాంటి ఘటనే మంగళూరులో చోటు చేసుకుంది. నవంబర్ 19న సాయంత్రం జరిగిన ఆటో పేలుడు కేసులో ప్రధాన నిందితుడైన షరీఖ్ ను పోలీసులు గుర్తించారు.
ఈ పేలుడులో ఆటోడ్రైవర్ తో పాటు షరీఖ్ అనే యువకుడు కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ ఇద్దరూ మంగళూరులోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వీరికి ఉ*గ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే నిందితుడు షరీఖ్ పై మూడు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మంగళూరులో 2, శివమొగ్గలో ఒక కేసు ఉన్నట్లు తెలిపారు. రెండు కేసులు యూఏపీఏ కింద నమోదు కాగా, మూడోది వాంటెడ్ కేసుగా నమోదు చేశారు. నిందితుడు షరీఖ్ చాలా కాలంగా పరారీలో ఉన్నట్లు తెలిపారు. మంగళూరు ఆటో బ్లాస్ట్ ఇన్సిడెంట్ లో నిందితుడైన మొహమ్మద్ షరీఖ్ కి కోయంబత్తూరుతో ఉన్న కనెక్షన్ ని తెలుసుకుని తమిళనాడు పోలీసులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు హై అలర్ట్ అయ్యారు.
షరీఖ్ కోయంబత్తూరులో కొన్ని నెలల పాటు ఉన్నాడని.. ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేసే సురేంద్రన్ అనే రూమ్ మేట్ ఆధార్ తో ఒక సిమ్ కార్డు ని తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సురేంద్రన్ ని కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించగా.. షరీఖ్ అనేవాడు తనతో పాటు రూమ్ ని షేర్ చేసుకున్నాడే తప్ప.. అతని గురించి తనకు పూర్తిగా తెలియదని వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. కేరళ సరిహద్దులోని అన్ని చెక్ పోస్టుల దగ్గర కోయంబత్తూరు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయడంతో పాటు.. కేరళలోని 11 చెక్ పోస్టుల, తమిళనాడు సరిహద్దులో ఉన్న కోయంబత్తూరు ప్రాంతం మొత్తం భారీగా పోలీసులు మోహరించారు.
కేంద్ర ఎజెన్సీలు నిందితుడు షరీఖ్ పూర్వాపరాలు, తమిళనాడులోని అతని పరిచయాలపై విచారణ ప్రారంభించాయి. అక్టోబర్ 23న కారు పేలుడు ఘటనలో తీవ్రవాద కార్యకర్త జమీషా ముబిన్ కాలి బూడిదైన తర్వాత.. జాతీయ దర్యాప్తు సంస్థ తీవ్రవాద కార్యకర్తలు, వారి పరిచయాలను వెలికితీసేందుకు తమిళనాడు అంతటా సోదాలు నిర్వహిస్తోంది. మంగళూరు పేలుడులో నిందితుడిగా ఉన్న షరీఖ్ కి.. తమిళనాడులో జరిగిన పేలుడులో నిందితులుగా ఉన్న జమీషా ముబిన్ సహా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న మరో ఆరుగురితో ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.