కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ట్విట్టర్ షాకిచ్చింది. ఢిల్లీలో ఇటీవల 9 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ హత్యపై ఇప్పటికీ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే హత్యకు గురైన తొమ్మిదేళ్ల చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించాడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వారిని ఓదారుస్తూ వారికి బాసటగా నిలిచాడు.
ఇదంతా బాగానే ఉంది కానీ..ఇక్కడే ఓ తప్ప జరిగింది. వారితో కలిసి దిగిన ఫోటోలను రాహుల్ గాంధీ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో బాగా వైరల్ అయ్యింది. దీంతో రాహుల్ గాంధీ షేర్ చేసిన ఫోటోను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తప్పు పట్టింది. రాహుల్ సహా చిన్నారి తల్లిదండ్రుల ముఖాలు స్పష్టంగా కనిపించేలా ఫోటో చేశాడంటూ ఆయనపై మండిపడింది.
వెంటనే దానిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించింది. ఇక జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ట్విట్టర్ ఇండియా, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. దీంతో దీనిపై స్పందించిన ట్విట్టర్ రాహుల్ గాంధీ పోస్ట్ చేసిన ఆ ఫోటోను తొలగించింది. నిబంధనలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఫోటో పోస్ట్ చేశాడని, అందుకే దానిని తొలగించామని రాహుల్కు ట్విట్టర్ వివరణను ఇచ్చింది.