వారికి రత్నాల్లాంటి ఇద్దరు కుమారులు జన్మించారు. పేద కుటుంబం అయినా సరే.. ఉన్నంతలో సంతోషంగా బతుకుతున్నారు. అయితే విధికి వారి మీద కన్నుకుట్టుంది. చిన్న కుమారుడికి ప్రాణాంతక వ్యాధి వచ్చింది. ఏం చేయాలో ఆ పేద తల్లిదండ్రులకు అర్థం కాలేదు. ఆదుకునే ఆపన్నహస్తం కోసం ఎదురు చూశారు. విషయం తెలుసుకున్న మానవతామూర్తులు.. సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. కోటి రూపాయల సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. బిడ్డను బతికించుకుంటామనే ఆశ చిగురించింది. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. రోడ్డు ప్రమాదం రూపంలో దురదృష్టం వారిని వెంటాడింది. తల్లిదండ్రులు మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి తీవ్రంగా గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కంట తడిపెట్టిస్తుంది. ఆ వివరాలు..
తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా కళ్లిపట్టుకు చెందిన బాలమురుగన్, సెల్వి దంపతులకు ఇద్దరు కుమారులన్నారు. కూలీ పని చేసుకుంటూ.. బిడ్డలతో కలిసి వారు సంతోషంగా జీవిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులో పని చేసుకుంటూ ఉంటున్నారు. ఈ క్రమంలో వారి నాలుగేళ్ల కుమారుడికి అరుదైన ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. సాయం కోసం దాతలను సంప్రదించారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓ సంస్థ చిన్నారి వైద్యం కోసం ఖర్చు అయ్యే కోటి రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. చికిత్స చేయించేందుకు రెడీ అవుతున్నారు.
ఈ క్రమంలో పెద్ద కుమారుడిని బెంగళూరులోనే తాత ఇంటి వద్ద ఉంచారు. ఆ తర్వాత స్వగ్రామం వెళ్లి కొన్ని పనులు చూసుకుని తిరిగి బెంగళూరు ప్రయాణం అయ్యారు. అయితే అనుకోకుండా అర్థరాత్రి హొకోటె మైలాపుర గేటు వద్ద అర్థరాత్రి వేళ రోడ్డు పక్కన ఆపి ఉన్న రాళ్ల లోడు లారీని బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలమురగన్, సెల్వి దంపతులు తీవ్రంగా గాయపడి.. అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది తీవ్రంగా గాయపడగా.. వారిని బెంగళూరు ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇక గాయపడిన వారిలో ముగ్గురు చిన్నారులుండగా.. వారిలో బాలమురగన్ చిన్న కుమారుడు ఉన్నాడు.
అసలే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. వైద్యం కోసం కోటి రూపాయలు సమకూరిన తర్వాత కూడా విధి ఇలా వంచిండంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దారుణ ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని.. డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కుమారుడికి వైద్యం అంది.. మళ్లీ బతుకుతాడని సంతోషంగా ఉన్న సమయంలో ప్రమాదంలో బాలమురగన్-సెల్వి దంపతులు మృతి చెందడం, చిన్నారికి గాయాలు కావడంతో గ్రామస్తులు తీవ్ర సంతాపం తెలుపుతున్నారు.