“మగువా..మగువా లోకానికి తెలుసా? నీ విలువా. మగువా..మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా” అంటూ స్త్రీ గురించి ఎందరో గొప్పగా పొగుడుతున్నారు. అలానే మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతూ.. మీకు మేము ఎందులోనూ తక్కువ కాదు అంటూ మగవారితో పోటీపడి మరి గెలుస్తున్నారు. కొన్ని విషయాల్లో సైతం మగవారిని ఓవర్ టేక్ చేస్తున్నారు మహిళలు. అయితే కెరీర్ తోపాటు చెడు అలవాట్లలోనూ మేము మీకు పోటీ అనేలా ఉంది తాజా పరిస్థితి చూస్తుంటే. అవునండీ.. మద్యపానం, ధూమపానంలోనూ ఆడ వారు మగవారిని మించిపోయారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS ) ఇటీవల వెల్లడించిన నివేదిక ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది.
ఒడిశాకు చెందిన NFHS నివేదిక ప్రకారం.. ఆ రాష్ట్రంలోని గత 5 ఏళ్లలో మద్యం సేవించే పురుషుల సంఖ్య తగ్గి, మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక్కడ 15 ఏళ్లు పైబడిన మహిళల్లో మద్యం వినియోగం 2015-16లో 2.4 శాతంగా ఉంది. ఇది 2020-21 నాటికి 4.3 శాతానికి పెరిగింది. అయితే ఇదే సమయంలో మగవారి విషయంలో ఈ సంఖ్య 39.3 శాతం నుంచి 28.8 శాతానికి తగ్గింది. పట్టణాల్లో మాత్రమే ఎక్కువ మద్యం సేవిస్తారనే అపోహను కూడా ఈ నివేదిక కొట్టిపారేసింది. ఈ సర్వే ప్రకారం.. గ్రామాల్లో 30.2 శాతం, పట్టణాల్లో 22.7 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నట్లు పేర్కొంది.
అయితే మహిళల విషయంలో ఈ గణాంకాలు విస్తు పోయేలా ఉన్నాయి. గ్రామీణ, పట్టణాలకు చెందిన మహిళలు వరుసగా 4.9 శాతం,1.4 శాతంగా మద్యం సేవించడంలో ముందున్నారు. మద్యంలోనే కాదు పొగాకులోను నారీ మనులు మగవారిని క్రాస్ చేశారంట. 2015-16లో కేవలం 17.3 శాతం మంది మహిళలకు మాత్రమే పొగాకు అలవాటు ఉండగా, తాజా సర్వే ప్రకారం ఈ సంఖ్య 26 శాతానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రాంతాల వారీగా చూస్తే పట్టణాల్లో 16.6 శాతం, గ్రామాల్లో26 శాతం మహిళలు పొగాకుకు బానిసలవుతున్నారు.
ఇదే సమయంలో పొగాకు వినియోగించే విషయంలో పురుషుల 55.9 శాతం నుంచి 51.6 శాతానికి తగ్గింది. పట్టణాల్లో 45.3 శాతం నుంచి 40.5 శాతానికి.. గ్రామీణ ప్రాంతంలో 58.8 శాతం నుంచి 54.1 శాతానికి తగ్గిందని తాజా సర్వే వెల్లడించింది. మరి.. అన్ని రంగాలతో పాటు ఇలాంటి వాటిలోనూ నారీమణులు పురుషులను ఓవర్ టేక్ చేసిందన్న ఈ సర్వేపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.