ఆధార్, పాన్ కార్డు వివరాలే కాదూ.. మనం నిత్యం వినియోగించే యాప్స్ లో పొందు పరిచే వివరాలు చోరీకి గురౌతున్నాయి. వీటి ద్వారా భారీ వ్యాపారం జరుగుతోంది. తాజాగా వ్యక్తిగత డేటా చోరీ ఘటన సంచలనం సృష్టించిన సంగతి విదితమే. తాజాగా దీనికి ఓ వ్యక్తి బాధితుయ్యాడు.
‘డేటా ఈజ్ వెల్త్’అని ఓ సినిమాలో ఊరికనే అనలేదు. మనకు గుర్తింపునిస్తున్న ఆధార్, పాన్ కార్డు, రేషన్ కార్డులతో పాటు అవసరాలకు వినియోగించే ప్రతి యాప్లో మనం పొందు పరిచే వివరాల ద్వారా డేటా భద్ర పరచబడుతోంది. ఇలా పొందుపరిచిన డేటాను కొంత మంది సైబర్ నేరగాళ్లు చోరీ చేస్తున్నారు. మన వ్యక్తిగత డేటా వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఈ డేటాను ఆధారంగా చేసుకుని బ్లాక్ మెయిల్ చేయడం లేదా వ్యాపారం చేసుకుంటున్నారు కేటుగాళ్లు. ఇటీవల ఓ వ్యక్తి డేటా చోరీకి పాల్పడగా.. రూ. 66.9 కోట్ల మంది అంటే దేశ జనాభాలో సగం మంది జాబితా అతడి వద్ద ఉన్నట్లు తేలింది. ఇందులో విద్యార్థుల వివరాలు కూడా ఉండటం గమనార్హం. ఈ డేటా చోరీ కారణంగా సామాన్యుడు చితికిపోతున్నాడు.
ఓ వ్యక్తి చిన్న దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. సడన్గా ఓ రోజు ఆదాయపు పన్ను శాఖ అధికారుల నుండి నోటీసులు వచ్చింది. ఏంటీ అని చూడగా. రూ. 12.23 కోట్లు కట్టాలని ఉంది. దీంతో ఖంగుతిన్న అతడూ, ఇతర కుటుంబ సభ్యులు లబోదిబోమన్నారు. ఎందుకు ఈ షోకాజ్ నోటీసు వచ్చిందో తెలుసుకునేందుకు ఓ చార్టెట్ అకౌంటెంట్ వద్దకు వెళ్లగా అసలు విషయం తెలిసింది. పాన్ కార్డు నంబర్ చోరీకి కావడంతో ఇలా జరిగినట్లు తేలింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ బిల్వార పట్టణంలో ఉంటున్న కిషన్ గోపాల్ చపర్వాల్ అనే వికలాంగుడు ఓ స్టేషనరీ దుకాణాన్ని నడుపుకుని జీవిస్తున్నాడు. మార్చి 28న అతని ఇంటికి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి రూ.12.23 కోట్లు చెల్లించాలని షోకాజ్ నోటీసు అందింది.
ఈ నోటీసు వివరాలను తెలుసుకునేందుకు కిషాన్ గోపాల్ ఓ చార్టెట్ అకౌంటెంట్ వద్దకు వెళ్లాడు. అయితే అతడి పాన్ కార్డును దుర్వినియోగం అయ్యిందని తేలింది.ముంబయి, సూరత్లలో రెండు డైమండ్ షెల్ కంపెనీలు పెట్టి కోట్లల్లో బోగస్ లావాదేవీలు జరిపించడానికి అతని పాన్ కార్డును వాడుకున్నారని ఆ చార్టెట్ అకౌంటెంట్ తెలిపాడు. దీంతో ఖంగుతిన్న బాధితుడు.. ఐటీ అధికారుల పంపిన నోటీస్కు తనకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను ఓ లోన్ మాత్రమే తీసుకున్నానని, దానితో బడ్డీ కొట్టు పెట్టానని.. ఆ లోన్లు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నానని వాపోయారు. తాను నెలకు రూ.8 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే సంపాదిస్తున్నానని తెలిపాడు. తన పాన్ కార్డు ఎవరు వాడారో తెలియదని.. ఈ విషయంలో తనకు ఉపశమనం కల్పించాలని కోరాడు. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.