ఎక్కడ చూసినా దొంగల బెడద. తాళం వేసిన ఇండ్లు, బైకులు, సెల్ఫోన్లు ఇలా ఒకటేమిటి దొరికిన కాడికి దొంగలు దోచుకుపోతున్నారు. అడుగడుగునా జనాలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దొంగలు రోడ్ల మీద కాపు కాస్తూ వాహనదారులను ఆపి నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. మరికొంతమంది దొంగలు అయితే ఏకంగా పట్టపగలే అందరూ చూస్తుండగానే దొంగతనానికి పాల్పడి ఏకంగా పోలీసులకు సవాల్ విసరడం లాంటివి చేస్తూ ఉంటారు. పట్టపగలు ఎంతోమంది చైన్ స్నాచర్లు ఒంటరిగా ఉన్న మహిళలనే టార్గెట్గా చేసుకుని రెచ్చిపోతున్నారు.
ద్విచక్రవాహనంపై వచ్చి ఏకంగా మహిళ మెడలో ఉన్న చైన్ లాక్కొని పోతోన్న ఘటనలు సీసీ కెమెరాల్లో రికార్డయి సోషల్ మీడియాలో వైరల్ గా అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్ – గ్వాలియర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అందరూ చూస్తుండగానే పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి బెదిరిస్తూ పట్టపగలు ఒక మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కుపోయారు.
కుమారుడిని ట్యూషన్ లో దింపేందుకు స్కూటీపై వెళ్తుంది మహిళ. అక్కడ కాపు కాచుకు కూర్చున్నారు ఇద్దరు దుండగులు ఇక గొలుసు లాక్కునేందుకు ప్రయత్నించగా మొదట వెనకాల ఉన్న కుమారుడు కూడా ప్రతిఘటించాడు. అంతలోనే జేబులో ఉన్న తుపాకీ తీయడంతో వాళ్ళు బెదిరిపోయారు. అటు ఇక గొలుసు లాక్కుని పోతున్నప్పటికీ అలాగే చూస్తూ ఉండిపోయారు చుట్టుపక్కల వాళ్ళు. సీసీ ఫుటేజి ఆధారంగా కేసు దర్యాప్తు జరుగుతోంది.