దేశంలో గత రెండేళ్లుగా కోవిడ్ ప్రభావంతో ప్రజలు పండుగలు జరుపుకోలేదు. ఈ సంవత్సరం కోవిడ్ ప్రభావం పెద్దగా లేకపోవడంతో అందరూ ఎంతో సంతోషంగా పండుగలు జరుపుకుంటున్నారు. చెడుపై మంచి గెలిచిన గుర్తుగా జరుపుకునే పండగ దీపావళి. ఈ సంవత్సరం దీపావళి సందర్భంగ దేవాలయాలు కిట కిటలాడాయి. సాధారణంగా గుడికి వెళ్లిన భక్తులకు పూజారులు తీర్థప్రసాదాలు అందిస్తుంటారు.. కానీ ఆ గుడిలో మాత్రం డబ్బులు పంచారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
దీపావళి రోజు భక్తులకు ప్రసాదం బదులు డబ్బులు పంచారు. మహరాష్ట్రలోని కాళీమాత ఆలయంలో ఈ కార్యక్రమం జరిగింది. అలా పండుగ రోజు డబ్బులు పంచితే భక్తులకు మంచి జరుగుతుందని పూజారి శక్తి మహరాజ్ అన్నారు. రెండేళ్లుగా దేవాలయానికి భక్తులు రావడం చాలా తక్కువ అయ్యిందని.. ఈసారి భక్తుల తాకిడి ఎక్కువగా ఉందని అన్నారు. ఈ ఆచారం 1984 లో ప్రారంభించినట్లు తెలిపారు శక్తి మహరాజ్. అమ్మవారి దీవెనల వల్లనే తాను ఈ పని చేస్తున్నానని తెలిపారు.
కాళీమాత అమ్మవారి పాదాల వద్ద పది రూపాయల నోట్లు నింపిన ఒక గిన్నె ఉంచుతారు. ఆ గిన్నెలో నుంచి దర్శనానికి వచ్చిన భక్తులకు ఒక్కొక్కరికీ రెండు మూడు నోట్లు ఇచ్చారు పూజారి. సోమవారం రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు భక్తులకు ఈ ప్రసాదాన్ని అందించారు. అమ్మవారి పాదాల వద్ద ఉంచిన ప్రసాదాన్ని పొందడానికి భక్తులు పోటెత్తారు. దాంతో అక్కడ వాతావరణం సందడిగా మారిపోయింది. ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ ఆలయం హిందూ శ్మశాన వాటిక సమీపంలో ఏళ్లనాటి కాళీమాత ఆలయం ఉంది.. దాన్ని 40 సంవత్సాల క్రితం పునరుద్దరించారు. ఈ ఆలయంలో ప్రధాన పూజారి శక్తి మహరాజ్ కొనసాగుతున్నారు. అప్పటి నుంచి ఈ ప్రసాద పంపిణీ చేస్తున్నాట్లు తెలిపారు. దీపావళి రోజున లక్ష్మీ పూజ చేసుకొని రాత్రి పది గంటల ప్రాంతంలో భక్తులు అమ్మవారి ఆలయానికి వెళ్తారు. ఈ ప్రసాదం దీపావళి పండుగ సందర్భంగా అమ్మవారి ఇచ్చే కానుకగా భావిస్తామని భక్తులు అంటున్నారు.