ఒడిశా రైలు ప్రమాద వార్త దేశప్రజల్ని షాక్కు గురి చేసింది. ఈమధ్య కాలంలో ఇంత ఘోర ప్రమాదం ఎప్పుడూ జరగలేదు. బాలాసోర్ దగ్గర జరిగిన ఈ యాక్సిడెంట్ మృతుల సంఖ్య 275కు చేరిందని ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జెనా ధ్రువీకరించారు. ప్రమాద మృతదేహాలను గుర్తించే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని తెలిసింది. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఇంత ఘోర ప్రమాదం వెనుక ఏమైనా కుట్ర కోణం దాగి ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదంపై రైల్వే శాఖ విచారణ కొనసాగిస్తోంది. ఈ ఘటనలో గూడ్సు రైలును ఢీకొట్టిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లోకోమోటివ్ డ్రైవర్ తీవ్రగాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. గూడ్సు రైలు గార్డు కూడా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆ టైమ్లో అతడు క్యాబిన్లో లేడని తెలుస్తోంది.
గ్రీన్ సిగ్నల్ వచ్చిన అనంతరమే రైలును ముందుకు నడిపామని కోరమాండల్ ఎక్స్ప్రెస్ లోకోమోటివ్ డ్రైవర్ చెప్పినట్లు రైల్వే ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ మెంబర్ జయ సిన్హా తెలిపారు. కాగా, ఈ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందుకొచ్చాడు. ఈ యాక్సిడెంట్లో మృతి చెందిన వారి పిల్లలకు తాను ఉచిత విద్యను అందిస్తానని సెహ్వాగ్ తెలిపాడు. బాధితుల పిల్లలను సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూలులో ఉచితంగా చదివిస్తానని.. ఆ బాధ్యతలు తాను తీసుకుంటానని ఈ డాషింగ్ బ్యాట్స్మన్ పేర్కొన్నారు. ఈ ప్రమాద బాధితుల్ని కాపాడేందుకు అహర్నిషలు కృషి చేస్తున్న రెస్క్యూ టీమ్స్, మెడికల్ టీమ్స్, వాలంటీర్లకు సెహ్వాగ్ కృతజ్ఞతలు తెలిపాడు. బాధితులకు అండగా నిలిచిన సెహ్వాగ్ను సోషల్ మీడియాలో నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. బాధితుల పిల్లలకు ఉచిత విద్య అందించాలనే వీరూ నిర్ణయం చాలా గొప్పదని ప్రశంసిస్తున్నారు.
This image will haunt us for a long time.
In this hour of grief, the least I can do is to take care of education of children of those who lost their life in this tragic accident. I offer such children free education at Sehwag International School’s boarding facility 🙏🏼 pic.twitter.com/b9DAuWEoTy
— Virender Sehwag (@virendersehwag) June 4, 2023