మూడు కొత్త సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్చ లేకుండానే రద్దు చేసింది. అలాగే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఏడాదిగా ఆందోళన చేస్తూ మరణించిన రైతుల ఎలాంటి పరిహారం ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో దాదాపు 750 మంది రైతులు మరణించారు. కాగా వారందరి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలంటూ రైతు సంఘాలు సహా విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీనిపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
రైతుల మరణాలకు సంబంధించిన విషయంపై ఎలాంటి రికార్డు లేదని, అందువల్ల రైతుల కుటుంబాలకు సాయం అందించడం కుదరదని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ బుధవారం పార్లమెంటుకు తెలియజేశారు. కాగా.. మూడు వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసినప్పటకీ.. రైతు సంఘాలు ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నాయి. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంపై చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని, ఆందోళనల్లో తమపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, మరణించిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని, విద్యుత్ చట్టంపై పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నాయి.