కొందరు కేటుగాళ్లు మాటలతో మాయ చేస్తుంటారు. ఉన్నదీ, లేనిదీ చెప్పి జనాలను నమ్మించి మోసం చేస్తుంటారు. వేషం, భాషలతో అబద్ధాన్ని కూడా నిజమని నమ్మేలా చేసి ఘరానా మోసాలకు పాల్పడుతుంటారు. అలాంటి ఓ కేటుగాడి ఘరానా మోసం దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. అరబ్ దేశస్థుడినని చెప్పుకుంటూ, అక్కడి రాజ కుటుంబం వద్ద పనిచేస్తానని చెప్పి నమ్మించి 5 స్టార్ హోటల్ యాజమాన్యానికే టోకరా వేశాడో వ్యక్తి. సకల సౌకర్యాలు, రాజభోగాలు, పూటకో విందు భోజనం లాంటి ఎన్నో సౌకర్యాలను అనుభవించి ఆఖరికి చెప్పాపెట్టకుండా అదృశ్యమయ్యాడు.
షరీఫ్ అనే ఓ వ్యక్తి ఢిల్లీలోని లీలా ప్యాలెస్ ఫైవ్ స్టార్ హోటల్లోని ఓ రూమ్లో గతేడాది ఆగస్టు 1వ తేదీన దిగాడు. అబుదాబి రాజ కుటుంబానికి చెందిన షేక్ బిన్ జాయేద్ అల్ నహ్యాయ్ దగ్గర తాను చాన్నాళ్లుగా పని చేస్తున్నానని అక్కడి వారిని నమ్మించాడు. అందుకోసం బిజినెస్ కార్డుతోపాటు యూఏఈలో నివాస గుర్తింపును కూడా చూపించాడు. మాటతీరు, వేషధారణ, భాషతో హోటల్ సిబ్బందిని అతడు బాగా నమ్మించాడు. నవంబరు 20 వరకు హోటల్లోనే గడిపాడు. దీనికి గానూ మొత్తం రూ.35 లక్షల బిల్లు కాగా.. అతడు రూ.11 లక్షలు మాత్రమే చెల్లించాడు. మధ్యలో రూ.20 లక్షలకు గానూ చెక్ ఇచ్చాడు.
చెక్ ఇచ్చిన తర్వాత హోటల్ నుంచి ఎవరికీ చెప్పకుండా షరీఫ్ జారుకున్నాడు. తీరా అతడు ఇచ్చిన చెక్ బౌన్స్ అవ్వడంతో అక్కడి సిబ్బంది కంగుతిన్నారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులకు హోటల్ యాజమాన్యం ఫిర్యాదు చేశారు. బిల్లు ఎగ్గొట్టడమే కాకుండా హోటల్లోని విలువైన సామాగ్రిని కూడా ఎత్తుకెళ్లినట్లు తమ కంప్లయింట్లో పేర్కొన్నారు. విచారణ ఆరంభించిన పోలీసులు అతడి చూపించిన గుర్తింపు కార్డులను పరిశీలించగా.. అవన్నీ ఫేక్ అని తేలింది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.