మనది పురుషాధిక్య సమాజం. ఆంక్షలన్ని ఆడవారికి.. అడ్డులేని స్వాతంత్య్రం మగవాళ్లకి సొంతం అనే భావన.. వేల ఏళ్లుగా మన సమాజంలో వేళ్లూనుకుపోయింది. భార్యను కోల్పోయినా.. విడాకులు తీసుకున్నా సరే.. మగాడు వెంటనే పెళ్లి చేసుకుంటాడు. సమాజం కూడా అయ్యో పాపం.. ఒంటరిగా ఎలా బతుకుతాడు అని సానుభూతి చూపుతుంది. కానీ అదే పరిస్థితి ఆడవాళ్లకు ఎదురైతే.. తలరాత.. దురదృష్టం.. జీవితం నాశనం అయ్యింది అంటారు. ఇక ఒకవేళ ఆమెకి పిల్లలు ఉంటే.. జీవితాంతం వారి కోసం బతకాల్సిందే. జీవితం మీద తన ఆశలు, కోరికలు అన్ని చంపుకుని.. పిల్లలే లోకంగా బతకాలి. భర్త చనిపోయినా, అతడి నుంచి విడాకులు తీసుకున్నా సరే.. చాలా మంది మహిళలు రెండో వివాహం పట్ల ఆసక్తి చూపరు. తాము మళ్లీ వివాహం చేసుకుంటే.. బిడ్డల జీవితాలు నాశనం అవుతాయని ఆలోచిస్తారు.
అయితే మారుతున్న కాలంతో పాటు.. సమాజంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తండ్రి లేకపోయినా సరే.. తమ కోసం జీవితాన్ని ధారపోసి.. తమ బాగు కోసం ఇన్ని రోజుల పాటు కష్టపడిన తల్లి.. కనీసం ఈ వయసులో అయినా సరే.. ఆమె జీవితంలో సంతోషం, ఆనందం వంటివి ఉండాలని బిడ్డలు భావిస్తున్నారు. అందుకే తాము పెళ్లి చేసుకుని.. జీవితాల్లో సెటిల్ అయితే తల్లి ఒంటరిగా ఉండాల్సి వస్తుంది.. కనుక ఈ వయసులో తల్లికి తోడు అవసరం అని భావించి.. అమ్మకు మళ్లీ పెళ్లి చేస్తున్న బిడ్డల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోతాజాగా సమాజ కట్టుబాట్లను తెంపి.. తల్లికి మరో పెళ్లి చేశాడు ఓ కుమారుడు. ఆ వివరాలు..
ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపుర్లో చోటుచేసుకుంది. యువరాజ్ షేలే (23) అనే వ్యక్తి పదేళ్ల వయసులో తన తండ్రిని కోల్పోయాడు. రోడ్డు ప్రమాదంలో షేలే తండ్రి మరణించాడు. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలన్నీ షేలేను చూసుకుంటున్నాడు. ఇక తండ్రి చనిపోయినప్పటి నుంచి తల్లి ఇంట్లోనే ఒంటరితనాన్ని అనుభవిస్తూ కాలం గడుపుతోంది. ఇక భర్త చనిపోయిన స్త్రీని ఈ సమాజం ఎలా చూస్తుందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక షేలే తల్లి కూడా.. ఇరుగు పొరుగువారితోనూ ఎలాంటి సంబంధాలు లేకుండా.. ఒంటరిగా ఉండేది. తల్లి పరిస్థితి చూసి షేలే బాధపడేవాడు. తల్లిని ఒంటరితనం నుంచి దూరం చేయాలని భావించాడు.
అందుకు ఒకటే మార్గం.. తల్లికి మళ్లీ పెళ్లి చేయడం. కానీ అది అంత సులువు కాదు. కానీ ప్రయత్నం చేస్తే తప్పకుండా సాకారం అవుతుంది. దీనిలో భాగంగా తన తల్లికి మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తన స్నేహితులు, బంధువులకి చెప్పి.. వారి సాయంతో.. తల్లి కోసం వరుడిని వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలో మారుతి అనే వ్యక్తి తన తల్లికి సరైన జోడిగా భావించాడు. అతడితో మాట్లాడి.. పెళ్లికి ఒప్పించాడు. అయితే తల్లిని పెళ్లికి ఒప్పించడం చాలా కష్టమయ్యిందని తెలిపాడు షేలే.
ఈ సందర్భంగా యువరాజ్ షేలే మాట్లాడుతూ.. ‘‘నాకు పదేళ్లు ఉన్నప్పుడు నాన్న రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో నేను.. షాకయ్యాను. ఆ బాధ నుంచి కోలుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. ఇక నాన్న మరణం.. అమ్మ జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. భర్త చనిపోయిన మహిళను ఈ సమాజం ఎలా చూస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాంతో ఆమె ఇంటికే పరిమితం అయ్యింది. ఎప్పుడు ఒంటరిగా గడుపుతూ.. బయటకు రావడం మానేసింది. తండ్రి మరణం తరువాత సామాజిక కట్టుబాట్లు మా అమ్మను మానసికంగా మరింత ప్రభావితం చేశాయి. ఆమెను ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావాలని కోరుకున్నాను. అప్పుడే నా తల్లి కోసం జీవిత భాగస్వామి అవసరాన్ని గ్రహించాను’’ అని వివరించాడు.
‘‘మా అమ్మ నాన్నకు దాదాపు 25 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇక మన దేశంలో ఒక మగాడు భార్యను కోల్పోతే.. వెంటనే కుటుంబ సభ్యులు, సమాజం.. అతడిని మళ్లీ పెళ్లి చేసుకోమని కోరుతుంది. కానీ అదే మహిళల విషయానికి వస్తే.. పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. ఇలాంటి విషయాలు నన్ను ఆశ్చర్యపరిచేవి. అందుకే నేను మా అమ్మను మళ్లీ పెళ్లికి ఒప్పించాలని నిర్ణయించుకున్నాను. ఇక సాంప్రదాయ విలువలతో కూడిన కొల్హాపూర్ లాంటి నగరంలో తన దగ్గరి బంధువులు, ఇరుగుపొరుగు వారిని ఒప్పించడం అంత సులువు కాదు. అయితే, కొందరు స్నేహితులు, బంధువులు తనకు మద్దతుగా నిలిచారు’’ అని తెలిపాడు.
వారి సాయంతో తన తల్లికి వరుడిని వెతికాను అన్నాడు షేలే. ‘‘ఈ క్రమంలో మారుతి ఘనావత్ గురించి తెలిసింది. అతడి గురించి అమ్మకు వివరించి ఒప్పించాను’’ అన్నాడు. ఇక ఘనావత్ మాట్లాడుతూ.. కొన్నేళ్ల నుంచి తాను ఒంటరిగా ఉన్నానని, షేలేను కలిసి మాట్లాడిన తర్వాత ఆ కుటుంబంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. రెండో పెళ్లి చాలా కఠిన నిర్ణయమని, ఇందుకు ఆమె ముందు ఒప్పుకోలేదని చెప్పారు. ఇక షేలే చేసిన పనిపై ఇరుగుపొరుగు వారు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా ఆలోచించే కొడుకు ఉండటం చాలా గ్రేట్ అంటున్నారు. మరి షేలే చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.