2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ ఇచ్చిన ఎన్నికల్లో హామీల్లో అతి ముఖ్యమైనది.. ప్రతి ఒక్కరి ఖాతాల్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తాను అనడం. పన్ను ఎగవేతదారులు విదేశాల్లో దాచుకున్న నల్లధనం వివరాలు వెల్లడిస్తానని.. ఆ మొత్తాన్ని ఇండియాకు రప్పిస్తే ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేయవచ్చని మోదీ ఉద్దేశం. అన్ని ఎన్నికల హామీల్లాగే.. అది కూడా గాల్లో కలిసిపోయింది. అయితే ఈ హామీపై ఇప్పటికి విపక్ష నేతలు ప్రధాని మోదీని ప్రశ్నిస్తూనే ఉంటారు. ఇదంతా ఓకే కానీ.. ఈ హామీ ఓ వ్యక్తి కొంప ముంచింది. 9 లక్షల రూపాయల అప్పు మిగిల్చింది. ఎందుకు.. ఎలా అనే వివరాలు తెలియాలంటే ఇది చదవండి.
మహారాష్ట్ర ఔరంగాబాద్ పైఠాన్ తాలుకా దావర్ వాడీ గ్రామానికి చెందిన ధ్యానేశ్వర్ జనార్ధన్ ఔటే అనే రైతు ఏదో అవసరం నిమిత్తం బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేశాడు. అకౌంట్ లో ఉన్న మొత్తం చూసి అతడికి గుండె ఆగినంత పనయ్యింది. ధ్యానేశ్వర్ అకౌంట్ లో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 15 లక్షల రూపాయలు జమ అయి ఉన్నాయి. జీరో బ్యాలెన్స్ ఖాతాలో ఇంత భారీ మొత్తం ఉందంటే.. అది కచ్చితంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ప్రకారం జమ అయిన డబ్బులే అని భావించాడు. ఇక ధ్యానేశ్వర్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మోదీకి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.
ఇది కూడా చదవండి : మోదీ అలా చేయడం నేరం.. పీఎంఓకు నోటీసులు
క్షణాల్లో ఈ విషయం ఊరంతా పాకింది. చుట్టుపక్కల వారు అతడికి అభినందనలు తెలిపారు. ప్రధాని మా అకౌంట్లలో ఎప్పుడు డబ్బులు జమ చేస్తాడో ఏంటో అని ఆశగా ఎదురు చూడసాగారు. ఇక ధ్యానేశ్వర్ తన అకౌంట్ లో ఉన్న 15 లక్షల రూపాయాల్లోంచి 9 లక్షలు విత్ డ్రా చేసి.. ఆ మొత్తంతో గ్రామంలో ఇల్లు కట్టుకున్నాడు. మిగిలిన 6 లక్షల రూపాయలు ఏం చేయాలా అని ఆలోచించసాగాడు.
అకౌంట్ లో భారీ ఎత్తున డబ్బులు జమ కావడం.. వాటితో తన సొంతింటి కలను సాకారం చేసుకున్నాను అనే సంతోషంలో ఉన్న ధ్యానేశ్వర్ కు ఒక్కసారిగా ఊహించని షాక్ తగిలింది. అతడికి వచ్చిన ఓ లేఖ అప్పటి వరకు అతడి ఇంట నెలకొన్న ఆనందాన్ని తుడిచిపెట్టేసింది. ఆ లేఖ పూర్తిగా చదివిన ధ్యానేశ్వర్ కు భయంతో కాళ్లు చేతులు ఆడటం మానేశాయి. ఏడుపు తన్నుకువచ్చింది. ధ్యానేశ్వర్ ని అంతలా భయపెట్టిన ఆ లేఖలో ఏం ఉంది అంటే.. జిల్లా పరిషత్ నుంచి పింపల్వాడీ గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు పొరపాటున మీకు వచ్చాయి. ఆ డబ్బు మొత్తాన్ని సత్వరమే తిరిగి చెల్లించాలి” అన్నది ఆ లేఖ సారాంశం. ఇది చదివిన వెంటనే అతడి గుండె పగిలినంత పనైంది. తన అకౌంట్లో మిగిలి ఉన్న 6 లక్షల రూపాయలను తక్షణమే తిరిగి చెల్లించేసినా.. ఇంటి కోసం ఇప్పటికే ఖర్చు చేసిన 9 లక్షల రూపాయలను ఎలా ఇవ్వాలా అని తలపట్టుకుంటున్నాడు ధ్యానేశ్వర్.
ఇది కూడా చదవండి : టీఆర్ఎస్ vs బీజేపీ.. నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
అప్పటి వరకు అతడి అదృష్టాన్ని పొగిడిన వారు.. ఈ వార్త తెలిసిన వెంటనే.. ఎగతాళి చేయడం ప్రారంభించారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నించారు. 15 లక్షల రూపాయల అంటే తక్కువ మొత్తం ఏం కాదు.. అంత డబ్బును తప్పుడు అకౌంట్ లో వేసినప్పుడు వెంటనే దాన్ని ఫ్రీజ్ చేపించి.. ఫండ్స్ ను వెనక్కి రప్పించాలి. కానీ నెలల తర్వాత తమ పొరపాటును గుర్తించడం ఏంటే.. అంటే సదరు అధికారులు విధి నిర్వహణలో ఎంత బాధ్యతగా ఉన్నారో దీన్ని బట్టి అర్థం అవుతుంది అని కామెంట్ చేస్తుండగా.. మరికొందరు ధ్యానేశ్వర్ కూడా అకౌంట్ లో భారీ మొత్తం ఉన్నప్పుడు ఎవరు డిపాజిట్ చేశారో కనుక్కొవాల్సింది.. అత్యాశకు పోయి.. అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చింది అని కామెంట్ చేస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.