ఆన్లైన్ లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఎంత చెబుతున్నా కొందరు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని అవకాశంగా మలుచుకొని కోట్లు కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు. బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన అనుభవం, అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం, బ్యాంకులను బురిడీ కొట్టించగల నైపుణ్యం ఉన్న అందరూ ఒక్కచోటికి చేరి ముఠాగా ఏర్పడ్డారు. నకిలీ కాల్ సెంటర్లతో విదేశీయులను బురిడీ కొట్టించి నాలుగేళ్లలో 1000 కోట్ల మేర కాజేశారు. ఇటీవలే ఈ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి : హైదరాబాద్ సైబర్ నేరాల్లో దోచుకున్న సొత్తు 4611 కోట్ల రూపాయలు
ఈ ముఠా అధికంగా ఆన్లైన్ ద్వారా కొనుగోళ్లు, చెల్లింపులు జరిపే ఖాతాదారులను లక్ష్యంగా చేసుకున్నారు. విదేశాల్లో ఉపయోగించే అధికశాతం అంతర్జాతీయ క్రెడిట్ కార్డులకు భారతదేశంలోని బ్యాంకులు ప్రాంఛైజీలుగా ఉండటంతో వీటిని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. అంతర్జాతీయంగా ఖాతాదారులు చేసే కొనుగోళ్లు, నగదు చెల్లింపులకు కార్డ్ నెంబర్, సీవీవీ, ఎక్సఫైరీ తేదీ ఉంటే సరిపోతుంది. ఇక్కడి మాదిరిగా ఓటీపీ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఈ అవకాశమే వారికి కోట్లు కురిపించింది.
అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల సొమ్ము కాజేసిన ఈ ముఠా వెనుక విదేశీయుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగైదు దేశాలకు చెందిన హవాలా ముఠాలతో వీరికి సంబంధాలు ఉండచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ముఠా టోల్ ఫ్రీ నంబర్లతో లక్షా ముప్పైవేల మందిని మోసం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు విదేశాల్లోని క్రెడిట్ కార్డు వినియోగదారుల డేటా సేకరించే పనిలో పడ్డారు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న నిందితులను విచారించేందుకు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు.