Kerala Lottery: ఆదివారం కేరళకు చెందిన ఆటో డ్రైవర్ కే అనూప్కు 25 కోట్ల రూపాయల లాటరీ తగిలిన సంగతి తెలిసిందే. ఓనం బంపర్ లాటరీలో అతడికి ఈ అదృష్టం వరించింది. ప్రస్తుతం అనూప్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిపోయాడు. అతడి అదృష్టానికి అంతా ఆశ్చర్యపోతున్నారు. అనూప్కు 22 ఏళ్లుగా లాటరీలు కొనటం అలవాటు. ఆ అలవాటు ప్రకారమే శనివారం లాటరీ కొన్నాడు. లాటరీ కొనటం కోసం డబ్బులు లేక తన కూతురి డబ్బుల కుండీని పగులకొట్టాడు. అందులోంచి రూ. 50 తీసుకుని లాటరీ వేశాడు. ఆదివారం లాటరీ డ్రా తీశారు. డ్రాలో అనూప్కు 25 కోట్ల రూపాయలు తగిలింది. తనకు లాటరీ తగిలిందని తెలియగానే అనూప్ మేఘాల్లో తేలిపోయాడు.
సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. అయితే, ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. జనం నుంచి అతడికి వేధింపులు మొదలయ్యాయి. దీనిపై అతడు మాట్లాడుతూ.. ‘‘ నాకు లాటరీ తగిలినపుడు మేఘాల్లో తేలిపోయాను. నా చుట్టూ జరుగుతున్న హంగామాకు సంతోషపడ్డాను. కానీ, ఇప్పుడు దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నా. పెద్దగా ప్రచారం చేసుకోవటం వల్ల అల్లాడుతున్నాను. నేను ఇంటికి కూడా వెళ్లలేకపోతున్నా. నా కూతురితో ఆడుకోలేకపోతున్నా. కొంతమంది నేరుగా మా ఇంటికి వచ్చి వేధిస్తున్నారు. సహాయం చేయమని అడుగుతున్నారు. మరి, కొంతమంది నన్ను ఆన్లైన్ ద్వారా వేధిస్తున్నారు. తమకు కూడా వాటా ఇవ్వమని అడుగుతున్నారు.
అదృష్టం కొద్దీ తగిలిందని అంటున్నారు. సేవా కార్యక్రమాలు చేయమని ఉపన్యాసం దంచుతున్నారు. దీంతో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. మా బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నాను. నాకు ఫస్ట్ ప్రైజ్ కాకుండా సెకండ్ రూ.5 కోట్లు లేదా థర్డ్ రూ. 1 కోటి వచ్చినా బాగుండు’’ అని అన్నాడు. ఇక, రూ. 25 కోట్ల లాటరీలో ఏజెంట్ కమీషన్, టాక్స్లు పోనూ 16.25 కోట్లు అనూప్కు అందనున్నాయని కేరళ లాటరీ డిపార్ట్మెంట్ తెలిపింది. మరి, 25 కోట్ల రూపాయల లాటరీ గెలుచుకుని ఇబ్బందుల పాలవుతున్న అనూప్ పరిస్థితిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వీడియో: అసెంబ్లీలో ఎమ్మెల్యేల పాడుపని! ఏం చేశారంటే..