ఇటీవల కాలంలో కోర్టులు ఇచ్చే తీర్పులు సంచలనంగా ఉంటున్నాయి. గతంలో సుప్రీ కోర్టు, హైకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులు పౌరులను షాక్ కి గురి చేశాయి. మరీ ముఖ్యంగా అత్యాచారాలు, అక్రమ సంబంధాలు, భార్యాభర్తల వివాదాలకు సంబంధించిన విషయాల్లో కోర్టులు అనేక ఆసక్తికరమైన తీర్పులను వెల్లడించాయి. తాజాగా కేరళ హైకోర్టు మరో సంచలన తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడగడం తప్పుకాదంటూ కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. అంతే కాక ఈ తీర్పు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేరళ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు మాత్రం ప్రభుత్వ కార్యాలయాల్లో విధులను నిర్వర్తించే వారికి అనుకూలంగా ఉందని మాత్రం చెప్పవచ్చు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల లంచం విషయం కోర్టు వరకు ఎలా వెళ్లింది? ఎందుకు వెళ్లింది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కేరళ రాష్ట్రంలోని చిత్ర దుర్గం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నుంచి ప్రభుత్వ ఉద్యోగి ఒకరు ఐదు వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ ఇంకా లంచం అడగడంతో సదరు వ్యక్తి కోపం తెచ్చుకున్నాడు. అయితే తన కోపాన్ని మనస్సులో పెట్టుకుని సదరు ఉద్యోగికి ఎలాగైన బుద్ధి చెప్పాలని భావించాడు. దీంతో వెంటనే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుపై స్పందించిన ఏసీబీ అధికారులు.. తాము చెప్పినట్లు చేయాలని సదరు బాధితుడికి తెలిపారు. దీంతో అతడు రూ.5000 తీసుకెళ్లి ఉద్యోగి టేబుల్ పై ఉంచాడు. ఇదే సమయంలో ఏసీబీ అధికారులు ఆ ఉద్యోగి పనిచేస్తున్న కార్యాలయంపై దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారులు దాడి చేసే సమయంలో ఆ ఉద్యోగి టేబుల్ పై లంచం సొమ్ము తాలూక డబ్బు కట్ట ఉండటం గుర్తించారు. అయితే ఆ డబ్బులను ఉద్యోగి తాకలేదు.
అయితే బాధితుడు మాత్రం సదరు ఉద్యోగికి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ కోర్టు వరకు వెళ్లాడు. ఈ కేసును బాగా పరిశీలించి కేరళ హైకోర్టు ఆసక్తికరమైన తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేయడం తప్పు కాదని, కానీ ఆ ఉద్యోగి లంచం తీసుకోవడం మాత్రం నేరమే అవుతుందని చెప్పిందని హైకోర్టు తీర్పు ఇచ్చింది. కేరళ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటగా మారిందని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా మంది లంచాన్ని డిమాండ్ చేయడంతో పాటు కచ్చితంగా తీసుకుంటున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే చాలా నిజయితీగా లంచం తీసుకోకుండా తమ విధులను నిర్వహిస్తున్నారు. కేరళ కోర్టు ఇచ్చిన తీర్పుపై చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.