మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. అన్ని ఎందరు ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా సరే.. మన దగ్గర మద్యం అమ్మకాలు ఏమాత్రం తగ్గడం లేదు. పైపెచ్చు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక ఇయర్ ఎండింగ్, పండుగల వేళ.. మద్యం ఒంగి పొర్లుతుంది. రికార్డు స్థాయిలో అమ్మకాలు సాగుతాయి. ఇక మద్యం ఎలా తయారవుతుంది.. వాటిల్లో వాడే పదార్థాల గురించి ఎంత భయంకరంగా వర్ణిస్తారో.. చాలా సందర్భాల్లో చూశాం. ఇక మద్యంలో ఎక్కువ గిరాకీ ఉండేది బీర్కే. మరి బీర్ తయారీలో వాడే నాలుగు ప్రధాన పదార్థాలు ఏంటి అంటే.. మాల్ట్, హాప్స్, ఈస్ట్, నీరు. ఇక యూట్యూబ్లో ఇంట్లోనే స్వయంగా బీర్ తయారీ విధానం గురించి బోలేడు వీడియోలు ఉన్నాయి. ఒక తెలుగు సినిమాలో కూడా సొంతంగా బీర్ తయారు చేసి.. అభివృద్ధి అయిన స్నేహితుల గురించి చూపించారు. రీల్ మీదనే కాక.. రియల్గా ఇద్దరు స్నేహితులు ఇలా స్వయంగా బీర్ తయారు చేసి.. విజయం సాధించారు. అది కూడా అటుకులు, పూలతో బీర్ తయారు చేసి.. రికార్డ్ సృష్టించారు. అది కూడా విదేశాల్లో. ప్రస్తుతం ఈ బీర్కు ఆ దేశంలో తెగ డిమాండ్ ఉంది. మరి ఆ యువకులు ఎవరు.. ఏ దేశంలో వీరు సక్సెస్ అయ్యారు అంటే..
కేరళకు చెందిన చంద్రమోహన్, సుకుమారన్ ఇద్దరు స్నేహితులు. వీరు పోలాండ్లో నివాసం ఉంటున్నారు. చంద్రమోహన్ ఇండో-పోలిష్ చాంబర్ ఆఫ్ కామర్స్ అనే సంస్థలో బిజినెస్ రిలేషన్స్ హెడ్గా పనిచేసేవాడు. ఇక సుకుమారన్ డిజైనర్గా పని చేసేవాడు. అయితే వీరిద్దరూ కలిసి బీర్ తయారు చేసేందుకు ఉక్రేయిన్ యుద్ధం కారణం అయ్యింది. పోలాండ్కు చెందిన ఓ వ్యాపారవేత్త.. తృణధాన్యాల తయారీ కోసం.. ఉత్తర ప్రదేశ్ నుంచి అటుకులను దిగుమతి చేసుకునేవాడు. అయితే యుక్రెయిన్ యుద్ధం కారణంగా.. సరుకు రవాణా చేసే ఓడ పోలాండ్లోని ఓడరేవుకు చేరుకోవడానికి కేవలం నాలుగు రోజుల ముందు, డిమాండ్, ధరలో తేడాలు రావడంలో.. పోలాండ్ వ్యాపారవేత్త అటుకులను తాను కొనలేనని చాంబర్ ఆఫ్ కామర్స్కు తెలిపాడు.
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 20 వేల కిలోల అటుకులు మిగిలిపోవడంతో ఏం చేయాలో సంస్థకు అర్థం కాలేదు. ఏదైనా పరిష్కారం ఆలోచించమని సంస్థ చంద్రమోహన్ని కోరింది. అప్పుడు ఆయన.. అటుకులను మొత్తం తానే కొనుగోలు చేశాడు. ఆ తర్వాత తన స్నేహితుడు సుకుమారన్ను కలిసి.. తాను బీర్ తయారు చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఇద్దరూ మలయాళీలు కావడంతో.. తమ ప్రాంతం పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా.. ఏదైనా చేయాలని భావించిన ఈ మిత్రలు.. తమ దగ్గర మిగిలిపోయిన అటుకులతో బీర్ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ.. ‘‘పోలాండ్లో అప్పటికే జపనీస్ బీర్ ఉంది. దాన్ని బియ్యంతోపాటు జపనీస్ హాప్తో తయారు చేస్తారు. అయితే, అటుకులతో యూరోపియన్ హాప్లను కలిపి కొత్త రుచితో బీర్ను తయారు చేయాలని మేం అనుకున్నాం. ఇందుకోసం మరో మలయాళీని కలిశాము. కరోనా మహమ్మారికి ముందు లిజో ఫిలిఫ్ అనే వ్యక్తి ‘కాలికట్ 1498’ పేరుతో సొంతంగా బీర్ తయారు చేసి.. పోలాండ్లో ప్రవేశపెట్టాడు. మా బీర్ తయారీలో మేం లిజో ఫిలిప్ సలహాలను ఉపయోగించుకున్నాం’’ అని తెలిపాడు.
వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రమోహన్, సుకుమారన్.. వెడ్డింగ్ ప్లానర్స్తో జతకట్టారు. వీరి ప్రయోగం సక్సెస్ అయ్యింది. ‘‘మలయాళీ స్పిరిట్స్’’ కంపెనీ పేరుతో వారిద్దరూ ఈ వ్యాపారం చేస్తున్నారు. ఈ కంపెనీ, ప్రతీ రెండు నెలలకు భారత, ఆసియా గ్రోసరీ దుకాణాల్లో 2,400 లీటర్ల బీర్ను పంపిణీ చేసేలా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పటివరకు వీళ్లు.. 50 వేల బాటిళ్లకు పైగా బీర్లను అమ్మినట్లు.. త్వరలోనే వ్యాపారాన్ని మరింత విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. మరి ఈ మిత్రులు సాధించిన విజయం మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.