సాధారణంగా రాజకీయ నాయకులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీల కార్లు, కాన్వాయ్లు రోడ్ల మీదకు వస్తే.. పోలీసులు తనిఖీలు చేయకుండా పంపిచేస్తారు. అవసరమైతే ట్రాఫిక్ కూడా ఆపుతారు. కానీ ఓ చోట మాత్రం అందుకు భిన్నమైన సంఘటన చోటు చేసుకుంది. ఏకంగా సీఎం కారునే తనిఖీ చేశారు. ఆ వివరాలు..
సీఎం కాన్వాయ్ రోడ్డు మీదకు వచ్చిందటే.. ట్రాఫిక్ను ఆపి మరి.. కాన్వాయ్ వెళ్లడానికి మార్గం సుగమం చేస్తారు. ప్రజలు ఇబ్బంది పడ్డా పట్టించుకోరు. సీఎం దాకా ఎందుకు.. ఎమ్మెల్యేలు, మినిస్టర్ల వాహనాలు రోడ్ల మీదకు వచ్చినా సరే.. ట్రాఫిక్ క్లియర్ చేసి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుకు పంపుతారు. వీఐపీల వాహనాలకు సంబంధించి పోలీసుల తీరు ఇలానే ఉంటుంది. ప్రాంతంతో సంబంధం లేకుండా.. ఎక్కడైనా ఇదే పద్దతి అనుసరిస్తారు. ఇక వారి వాహనాల్లో తనిఖీలు చేయడం అనేది దాదాపు అసాధ్యం. కానీ ఓ చోట మాత్రం పోలీసులు ఏకంగా ముఖ్యమంత్రి వాహనాన్ని ఆపి సోదాలు నిర్వహించారు. సీఎం కారులో మందు, డబ్బులు తరలిస్తున్నారేమో అని జాగ్రత్తగా పరిశీలించారు. ఆ వివరాలు..
ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. రాష్ట్ర పోలీసులు ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వాహనాన్నే తనిఖీ చేశారు. అందుకు ప్రత్యేక కారణం కూడా ఉంది. మరి కొద్ది రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టి.. అన్ని వాహనాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ అధ్వర్యంలో బెంగళూరు రూరల్ జిల్లా దొడ్డబల్లాపుర్ ప్రాంతంలోని హోసహుద్య సమీపంలో చెక్ పోస్ట్ వద్ద ఈ తనీఖీలు జరిగాయి. అదే సమయంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వాహనశ్రేణి అదే మార్గంలో వస్తోంది. దాంతో మిగతా వాహనదారుల మాదిరిగానే.. ముఖ్యమంత్రి కాన్వాయ్ను ఆపారు పోలీసులు. అనంతరం ఆ వాహనాలు అన్నింటినీ తనిఖీ చేశారు.
ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఘాటి సుబ్రహ్మణ్య దేవాలయానికి దర్శనం కోసం వెళ్లినట్లు అధికారులు తెలిపారు. అయితే పోలీసులు చేసిన ఈ పనిపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మల్లికార్జున్ మాట్లాడుతూ.. ‘‘త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అక్రమ నగదు, మద్యం రవాణా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో వీటిని నిలువరించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఈ ప్రాంతంలో మొత్తం ఆరు చెక్పోస్ట్లు ఏర్పాటు చేశాం. అందరి వాహనాలు తనిఖీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి వాహనాన్ని కూడా తనిఖీ చేశాం. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు’’ అని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన మేరకు.. కర్ణాటక శాసనసభ ఎన్నికలకు ఏప్రిల్ 13న నోటిఫికేషన్ వెలువడుతుంది. మే 10న పోలింగ్ జరుగుతుంది. అదే నెల 13న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. మరి పోలీసులు చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.