సృష్టిలో అన్ని బంధాల కన్నా స్నేహ బంధం గొప్పది అంటారు. ఎందుకంటే మన అభిరుచికి, వ్యక్తిత్వానికి తగ్గట్లు స్నేహితులను మనమే ఎంచుకుంటాం. స్నేహితుడు అంటేనే మన హితం కోరేవాడు. కష్టాల్లో తోడుగా ఉంటాడు. ఇక స్నేహానికి పేద-ధనిక అనే బేధాలుండవు. స్నేహ బంధం గొప్పతనాన్ని నిరూపించే సంఘటనలు కోకొల్లలు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ప్రాణ మిత్రుడు కరోనాతో మృతి చెందాడు. భర్తలేని లోకంలో నేను ఉండలేనంటూ.. స్నేహితుడి భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సమయంలో భర్త స్నేహితుడు ఆమెకు ఆపన్న హస్తం అందించాడు. ఆమెతో ఏడడుగులు నడిచి.. కొత్త జీవితాన్ని ఇచ్చి.. ఆమె జీవితంలోకి సంతోషాలను తిరిగి తీసుకువచ్చాడు. చనిపోయిన స్నేహితుడి కోసం ఆ వ్యక్తి చూపిన ఔదార్యాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ప్రాణ మిత్రులమని మాటల్లో చెప్పడం.. కాదు ఇలా చేతల్లో చూపాలంటున్నారు. ఆ వివరాలు..
కర్ణాటకలోని చామరాజ్నగర్ జిల్లా ముల్లూర్ గ్రామానికి చెంది చేతన్ కుమార్, లోకేశ్లు ప్రాణస్నేహితులు. చేతన్ బెంగళూరులోని ఓ ప్రయివేట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. అతడికి గుల్బర్గా జిల్లాలోని హనూర్కు చెందిన అంబికతో 8 ఏళ్ల కిందట వివాహం జరిగింది. బెంగళూరులోని ఉద్యోగం చేస్తున్న చేతన్.. కరోనా రెండో వేవ్ సమయంలో కోవిడ్ బారినపడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ క్రమంలో చేతన్ భార్య అంబిక.. భర్త మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యాయత్నం చేసింది. చేతన్ మరణం అటు లోకేశ్ను తీవ్రంగా బాధించింది. ఈ సమయంలో స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచి.. అంబికను ఓదార్చాడు. ఎలాగైనా అంబికకు అండగా నిలవాలనుకుని నిర్ణయించుకున్నాడు లోకేశ్.
దానిలో భాగంగా ఆమెను వివాహం చేసుకోవాలని భావించాడు లోకేశ్. తన నిర్ణయం గురించి తల్లిదండ్రులకు తెలియజేశాడు. వారు కుమారుడి నిర్ణయాన్ని స్వాగతించడంతో.. అనంతరం తన నిర్ణయం గురించి అంబిక కుటుంబ సభ్యులతో మాట్లాడాడు లోకేశ్. అందుకు వారు కూడా అంగీకరించారు. దీంతో జనవరి 27న చామరాజనగర్లోని శివయోగి మఠంలో అంబిక మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇరు కుటుంబాలను ఈ జంటను ఆశీర్వదించాయి. ఈ విషయం తెలిసిన స్థానికులు లోకేశ్ ని ప్రశంసిస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.