కర్ణాటకలో ‘హిజాబ్’ గొడవ రాజకీయ రంగు పులుముకుంటోంది. విద్యా సంస్థల్లో యూనిఫాం నిబంధనలు పాటించాల్సిందేనని పాలక బీజేపీ అంటుండగా హిజాబ్కు మద్దతుగా విపక్ష కాంగ్రెస్ గొంతు విప్పింది. రాష్ట్రంలో పలుచోట్ల కాలేజీల్లో హిజాబ్ (స్కార్ఫ్) ధరించిన బాలికలను అనుమతించపోవడంపై కొద్ది రోజులుగా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. మరోవైపు విద్యార్థినులు హిజబ్ ధరించి కాలేజీలకు హాజరవుతుండగా దీనికి వ్యతిరేంగా కొందరు విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి కాలేజీలకు వచ్చారు. ప్రస్తుతం కర్ణాటకలో ఈ వివాదం తారాస్థాయికి చేరింది. అసలు హిజాబ్ వివాదం ఎలా మొదలైంది.. ప్రభుత్వ వాదన ఏంటి.. అటు కాలేజీలు ఏం చెబుతున్నాయో తదితర వివరాలు..
ఏంటి హిజాబ్ వివాదం..
ప్రభుత్వ కాలేజీల్లో యూనిఫాం తప్పనిసరి చేస్తూ.. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో యూనిఫాం ఎలా ఉండాలనేది కళాశాల అభివృద్ధి కమిటీలు నిర్ణయిస్తాయి. అసలు యూనిఫాం అవసరమా, కాదా అనేది ప్రైవేట్ సంస్థలు నిర్ణయించుకోవచ్చు అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉత్తర్వుల అమలులో ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. కానీ కర్ణాటకలోని ఉడిపి పట్టణంలో ఉన్న ఓ ప్రీ యూనివర్సిటీ కాలేజ్ కి చెందిన ఇంటర్ విద్యార్థినులు కొందరు క్లాస్ రూంలో కూడా హిజాబ్ ధరించడానికి తమకు అనుమతివ్వాల్సిందిగా కోరారు. కానీ కాలేజీ యాజమాన్యం అందుకు అంగీకరించకపోవడంతో.. వారు కాలేజీ బయట నిల్చుని నిరసన తెలిపారు. హిజాబ్ ధరించడం తమ హక్కని.. అందుకు అనుమతించల్సిందిగా కోరారు.
కానీ కాలేజీ యాజమాన్యం మాత్రం ‘‘విద్యార్ధినులు హిజాబ్ ధరించి క్యాంపస్లో తిరగడానికి అనుమతించాం. వాళ్లు క్లాసులో మాత్రమే హిజాబ్ ధరించరాదని నిబంధన పెట్టాం. మిగతా మైనారిటీ విద్యార్థినులు ఎవరు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ ఓ ఐదుగురు మాత్రమే దీనిపై రాద్దాంతం చేస్తూ.. సమస్యను పెద్దది చేస్తున్నారని’’ ఆరోపించారు.
ముదిరిన వివాదం.. తెరపైకి కాషాయ కండువాలు
ముస్లిం బాలికలు క్లాస్ రూమ్ లోకి హిజాబ్ ధరించి రావడాన్ని నిషేధించినప్పటికి.. పలువురు విద్యార్థినులు వాటిని పట్టించుకోకుండా హిజాబ్ ధరించి క్లాస్ రూంలకు హాజరవుతున్నారు. దీనికి వ్యతిరేకంగా మరికొందరు విద్యార్థులు కాషాయ కండువాలు వేసుకుని కాలేజీలకు వచ్చారు. అంతేకాకుండా ర్యాలీలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం ఉడుపి కుందాపూర్లో కొందరు బాలబాలికలు కాషాయ కండువాలు ధరించి ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. జనవరిలో ఉడుపిలోని పీయూ కాలేజీలో స్కార్ఫ్తో వచ్చిన ఆరుగురు స్టూడెంట్లను వెనక్కు పంపడంతో మొదలైన ఈ గొడవ తాజాగా కుందాపూర్, బైందూర్తో పాటు బెల్గావీ, హసన్, చిక్మగళూరు, శివమొగ్గ, మైసూరు సహా పలు చోట్లకు విస్తరించి ప్రభుత్వానికి కొత్త తలనొప్పి తెచ్చి పెట్టింది.
రాజకీయ రంగు పులుముకున్న వివాదం..
కాలేజీలో ప్రారంభమైన వివాదం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. హిజాబ్ను అనుమతించాలన్న డిమాండ్కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతు పలికారు. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య హిజాబ్ అనుకూల ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. ‘‘హిజాబ్ సాకుతో రాష్ట్రమంతటా మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు బీజేపీ, ఆరెస్సెస్ ప్రయత్నిస్తున్నాయి. ఒక వర్గానికి చెందిన బాలికలను చదువుకు దూరం చేయడమే దీని వెనక సంఘ్ పరివార్ ప్రధాన ఎజెండా’’ అని ఆరోపించారు.
ఈ ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ నళిన్కుమార్ కటీల్ తోసిపుచ్చారు. సిద్ధరామయ్యే విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘‘ఇక్కడున్నది బీజేపీ ప్రభుత్వం. విద్యా సంస్థలు సరస్వతీ నిలయాలు. హిజాబ్ తదితరాలకు అక్కడ స్థానం లేదు. వాటిల్లో తాలిబన్ తరహా పరిస్థితులను అనుమతించబోం. ప్రభుత్వ నియమ నిబంధనలకు అంతా కట్టుబడాల్సిందే’’ అన్నారు. ‘‘ఇప్పుడు హిజాబ్ను అనుమతిస్తే తర్వాత బుర్ఖా అంటారు. స్కూళ్లలో మసీదులు కడతామంటారు’’ అని బీజేపీ ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్ అన్నారు. ఈ వివాదానికి కాంగ్రెస్, బీజేపీ రెండూ బాధ్యులేనని మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి విమర్శించారు.
పార్లమెంటులో హిజాబ్ రగడ..
సోమవారం లోక్సభలో ఈ అంశాన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలకు చెందిన సభ్యులు ప్రస్తావించారు. విద్యార్థినుల వస్త్రధారణ ఆధారంగా బోధనను అడ్డుకోవడం దారుణమన్నారు. ఈ అంశంపై కేంద్ర విద్యాశాఖ తక్షణం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని డిమాండ్ చేశారు. కర్ణాటక సర్కారు తీరు సరికాదని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
హైకోర్టుకు చేరిన వివాదం..
ఈ అంశంపై హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. హిజాబ్ను అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ ఉడుపి గవర్నమెంట్ ప్రీ వర్సిటీ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థినులు వేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు మంగళవారం విచారించనుంది. హైకోర్టు తీర్పుతో ఈ వివాదానికి ముగింపు లభించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతానికి హిజాబ్ ధరించడానికి అనుమతి ఇవ్వాలని మొండిపట్టు పట్టిన విద్యార్థునిలను కాలేజీ క్యాంపస్ విడిచి వెళ్లిపొమ్మని అధికారులు స్పష్టం చేశారు. ఐదుగురు విద్యార్థినిల నిరసనతో ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు రాష్ట్రం అంతటా వ్యాపించింది. ఇక దీనిపై హైకోర్టు ఎలాంటి తీర్పు వెల్లడించనుందో చూడాలి. ఈ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.