పెళ్లైయ్యే నాటికి తన భార్య మైనర్ అని, ఆ వివాహాన్ని రద్దు చేయాలంటూ ఓ భర్త కోర్టు మెట్టెక్కాడు. అదీ కూడా వివాహమైన కొన్ని నెలలు తర్వాత. విచారణ చేపట్టిన స్థానిక ఫ్యామిలీ కోర్టు.. ఆరేళ్ల తర్వాత పెళ్లి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ బాధితురాలు హైకోర్టుకు వెళ్లగా.. ఆ వివాహాన్ని రద్దు చేయడం సాధ్యం కాదని తీర్పునిచ్చింది.
వివరాల్లోకి వెళితే..కర్ణాటకలోని మండ్య జిల్లాకు చెందిన మంజునాథ్ కు సుశీలతో 2012 జూన్ 15న వివాహం జరిగింది. వివాహ సమయంలో తన భార్యకు 18 ఏళ్లు నిండలేదని, తన భార్య కుటుంబ సభ్యులు తనను మోసం చేశారంటూ, కొన్ని నెలలు తర్వాత ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఆ పెళ్లిని రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే అతడి పిటిషన్ ను విచారించిన కోర్టు గత ఏడాది మంజునాథ్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది.
కాగా, ఈ తీర్పును సవాలు చేస్తూ సుశీల హైకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ విశ్వజిత్ శెట్టిలతో కూడిన డివిజనల్ బెంచ్ ఇన్నాళ్లు కాపురం చేశాక పెళ్లి సమయంలో తన భార్య మైనర్ అనే కారణాన్ని చూపుతూ పెళ్లి రద్దు చేయాలని కోరడం సబబు కాదని, ఆ పెళ్లిని రద్దు చేయలేమని స్పష్టం చేసింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.