ఒక ఆస్పత్రిలో మహిళకు సిజేరియన్ చేస్తుండగా హఠాత్తుగా అక్కడ భూప్రకంపనలు మొదలయ్యాయి. అయినా డాక్టర్లు ఆపరేషన్ ఆపలేదు. ఇది ఎక్కడ జరిగిందంటే..!
మన సమాజంలో వైద్య వృత్తికి ఉన్న ప్రాముఖ్యత వేరు. చావుబతుకుల్లో ఉన్న వారికి ప్రాణం పోస్తారు కాబట్టే డాక్టర్లను దేవుళ్లని పిలుస్తారు. పేషెంట్లను కాపాడే క్రమంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా డాక్టర్లు వెనకడుగు వేయరని చెబుతారు. దీన్ని నిరూపిస్తూ తాజాగా జమ్మూ కశ్మీర్లో ఓ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి సంభవించిన భూకంపం దక్షిణాసియా దేశాల ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించింది. కొన్ని సెకన్లపాటు చోటుచేసుకున్న భూ ప్రకంపనలతో ఉత్తర భారత్లోనూ పలు భవనాలు దెబ్బతిన్నాయి. భూప్రకంపనల భయంతో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగుతీశారు. కానీ కశ్మీర్లోని ఓ ఆస్పత్రిలో అదే సమయంలో వైద్యులు ఓ మహిళకు సిజేరియన్ నిర్వహిస్తున్నారు. దీంతో భూప్రకంపనల సమయంలో ఆపరేషన్ గదిలోనూ ఆ కదలికలు కనిపించాయి. అయినా డాక్టర్లు తొణకకుండా తమపని కొనసాగించారు. దీనికి సంబంధించిన వీడియోను అనంత్నాగ్ జిల్లా అధికారులు ట్విటర్లో పోస్టు చేశారు.
అనంత్నాగ్లోని ఆస్పత్రిలో వైద్య సిబ్బంది ఓ మహిళకు ఆపరేషన్ చేస్తున్నారు. అప్పుడే భూకంపం చోటుచేసుకుంది. దాని ప్రభావం ఆ రూమ్లోనూ కనిపించింది. భూప్రకంపనల ధాటికి వైద్య సామగ్రి, ఓవర్హెడ్ లైట్స్, మానిటర్, ఐవీ డ్రిప్ స్టాండ్ ఊగడం ప్రారంభించాయి. అప్పుడే ఒక వ్యక్తి దేవుడికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. బిడ్డను సేఫ్గా ఉంచు.. అని మధ్యలో ఓ డాక్టర్ మాట్లాడటం ఆ వీడియోలో వినిపిస్తోంది. సరిగ్గా అదే సమయంలో కరెంట్ పోయింది. అప్పుడు అక్కడ కేవలం ఓ మానిటర్ వెలుగు మాత్రమే ఉంది. కొన్ని సెనన్ల పాటు ఆపరేషన్కు అంతరాయం కలిగినప్పటికీ.. డాక్టర్లు కంగారు పడకుండా తమ పని పూర్తి చేశారు. వైద్యులు ఇలా క్లిష్ట సమయంలోనూ ప్రశాంతంగా తమ విధులు నిర్వర్తించడాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.
Emergency LSCS was going-on at SDH Bijbehara Anantnag during which strong tremors of Earthquake were felt.
Kudos to staff of SDH Bijbehara who conducted the LSCS smoothly & Thank God,everything is Alright.@HealthMedicalE1 @iasbhupinder @DCAnantnag @basharatias_dr @DHSKashmir pic.twitter.com/Pdtt8IHRnh— CMO Anantnag Official (@cmo_anantnag) March 21, 2023