సాధారణంగా రైలు ప్రయాణాలు అంటే హడావుడి.. పెద్ద పెద్ద శబ్దాలు.. గందరగోళంగా ఉంటుంది. తాజాగా ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు భారతీయ రైల్వే శాఖ కొత్త నిబంధనలను రూపొందించింది. రైలులో తోటి ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలిగించినా కేసు నమోదు చేసి జైలుకు పంపాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు గుంపులుగా ప్రయాణించే ప్రయాణికులు అర్థరాత్రి వరకు మాట్లాడకూడదని స్పష్టం చేసింది. రాత్రి 10 గంటల తర్వాత అన్ని లైట్లు ఆపేయాలనే కొత్త నిబంధనను కూడా తీసుకువచ్చింది. నిబంధనలను పాటించని ప్రయాణీకులపై రైల్వే చట్టం నిబంధనల ప్రకారం కఠినంగా వ్యవహరిస్తారు.
ఇకపై రైలు ప్రయాణం చేసే సమయంలో బోగీల్లో ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లలో పాటలు పెట్టి పెద్దపెద్ద శబ్దాలు చేయడాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ పనిని రైల్వే రక్షక దళానికి (ఆర్పీఎఫ్) అప్పగించింది. తోటి ప్రయాణికుల వల్ల ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా 139 నంబర్కు ఫోన్ చేస్తే చాలు.. అలా ఇబ్బందికరంగా ప్రవర్తించే వారిపై ఆర్ఫీఎఫ్ సిబ్బంది తక్షణ చర్యలు తీసుకుంటారు. గత కొంత కాలంగా ఇలాంటి సమస్యలపై రైల్వే మంత్రిత్వ శాఖకు అనేక ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో అధికారులు ఈ కొత్త నిబంధనను తీసుకువచ్చారు. రైలులో ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆర్పీఎఫ్, టికెట్ చెకర్స్, కోచ్ అటెండెంట్లు, క్యాటరింగ్తో సహా రైలు సిబ్బంది నిరంతర పర్యవేక్షన ఉంటుంది.
ఇది చదవండి : అల్లు అర్జున్ కి సర్ ప్రైజ్ వెల్ కమ్ చెప్పిన కూతురు
ప్రయాణికుల అసౌకర్యం కలిగితే రైలు సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. రైల్వే శాఖ జారీ చేసిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్లో అమలులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు రాజమహేంద్రవరం ఆర్ఫీఎఫ్ ఇన్స్పెక్టర్ సైదయ్య రైల్వే ప్రయాణికులను అలర్ట్ చేశారు. ఎలాంటి అసౌకర్యం కలిగినా.. 139కు ఫోన్ చేయాలని సూచించారు. చిన్న ఫోన్ కాల్ చేస్తే చాలు.. సదరు వ్యక్తిపై న్యూసెన్స్ కేసు నమోదు చేసి, జైలుకు పంపుతామని హెచ్చరికలు జారీ చేశారు.