అమ్మతనం ఆడవాళ్లకు మాత్రమే దొరికిన వరం. సంసారం చక్కగా సాగిపోతున్నా, పిల్లలు లేకపోతే కుటుంబ సభ్యుల నుండి, చుట్టూ ప్రక్కల వారి నుండి గొడ్రాలు అని పిలిపించుకోవాల్సి వస్తుందని భయపడిపోతుంటారు. అందుకే అమ్మ అనే పిలుపుకోసం పెళ్లి నాటి నుండి తల్లి అయ్యేంత వరకు పరితపించి పోతారు. కానీ కొందరి మహిళల్లో హార్మోన్లు, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా అండాలు విడుదల కాక.. పిల్లలను కనలేక.. వేదన అనుభవిస్తుంటారు. ఎంత మంది వైద్యులను సంప్రదించినా, మందులు తీసుకున్నా ఒక్కొక్కసారి ఫలితం శూన్యం.
కానీ జల్సాలకు అలవాటు పడ్డ ఓ మహిళ.. ఆ అండాలనే అమ్ముకుంది. ఈ నీచానికి సదరు తల్లి కూడా సహకరించడం ఘోరం. ఈ విస్తు పోయే ఘటన గుజరాత్ లోని అమ్రైవాడి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. భార్య అండాలు విక్రయిస్తుందని తెలుసుకున్న భర్త ఆమెను నిలదీయగా.. అతడ్ని కూడా చంపేస్తానని బెదిరింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదునిచ్చాడు. వివరాల్లోకి వెళితే.. రాశిక్ చవ్డా, అనితలకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. తరచూ తన అత్తమామలతో అనిత గొడవపడుతూ ఉండేది. వేరే కాపురం కాపురం పెట్టాలని భర్తతో పోరు పెట్టడంతో.. అద్దెకు ఇళ్లు తీసుకుని ఉంటున్నారు.
అయితే భర్త సంపాదన సరిపోవడం లేదంటూ రాశిక్ తో అనిత గొడవ పడటంతో.. 2019లో ఆమెను వదిలేసి, తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాడు. తనను వదిలేసి వెళ్లిపోయాడంటూ అమ్రైవాడీ పోలీస్ స్టేషన్ లో భర్తపై ఫిర్యాదు చేయడంతో పాటు భరణం ఇప్పించాలంటూ అనిత కోర్టుకెక్కింది. అయితే కొంత కాలానికి సయోధ్య కుదరడంతో మళ్లీ కలిసి జీవిస్తున్నారు. ఇటీవల భార్య తన అండాలను విక్రయిస్తున్న విషయం తెలుసుకున్నాడు. 2019 నుండి 2022 మధ్య పలు మార్లు ఓ ఏజెంట్ ద్వారా అహ్మదాబాద్ లోని పలు ఆసుపత్రులకు అమ్మినట్లు గుర్తించాడు.
అండాల విక్రయానికి అనితకు ఆమె తల్లి హన్సబెన్ కూడా సహకరిస్తుందని తెలుసుకుని భార్యను రాశిక్ నిలదీశాడు. ఈ విషయం ఎవ్వరికైనా చెబితే చంపేస్తానని రాశిక్ ను భార్య అనిత, అత్త బెదిరించాడు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. అండాల విక్రయానికి వీలుగా అనిత తన ఆధార్ కార్డులో పుట్టిన తేదీలను మార్చుకుందని పేర్కొన్నాడు. అంతేకాకుండా వీటిని అమ్ముకునేందుకు భర్త సంతకాలు కావాల్సి ఉండటంతో, వాటికి సంబంధించిన కాగితాలపై అనిత ఫోర్జరీ సంతకాలు చేసినట్లు తెలిపాడు. ఫిర్యాదును తీసుకున్న పోలీసులు, అనిత, ఆమె తల్లిపై ఫోర్జరీ, క్రిమినల్ కేసులు నమోదు చేశారు.