ఆసియాలోనే సంపన్నుడు, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సమాజ సేవకు ముందుకొచ్చారు. తన 60వ పుట్టిన రోజును పురస్కరించుకుని అదానీ, ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. సమాజ సేవ కోసం రూ.60 వేల కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. విద్య, వైద్యం, నైపుణ్య అభివృద్ధి కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. అదానీ ఫౌండేషన్ ద్వారా ఈ మొత్తాన్ని దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేయనున్నారు. గౌతమ్ అదానీ తండ్రి శాంతిలాల్ అదానీ శత జయంతి కూడా ఈ ఏడాదే కావడంతో దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో సేవ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
రూ. 60 వేల కోట్ల విరాళ మొత్తాన్ని అదానీ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా విద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్యాభివృద్ధి కోసం వినియోగించనున్నారు. ఇందుకోసం మూడు కమిటీలు నియమిస్తామని గౌతమ్ అదానీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ మొత్తాన్ని ఏయే రూపాల్లో వినియోగించాలనేది ఆయా కమిటీలు నిర్ణయిస్తాయని ఆయన తెలిపారు. ఈ కమిటీల్లో అదానీ కుటుంబ సభ్యులు సహాయక సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు.ఇప్పటి వరకు దాతృత్వంలో కార్పొరేట్లు రతన్ టాటా, అజీం ప్రేమ్ జీ ముందు ఉండేవారు. తాజాగా వారి సరసన గౌతం అదానీ చేరనున్నారు.
1988లో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన అదానీ గ్రూప్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని క్రమక్రమంగా విస్తరించింది. దేశంలో ప్రస్తుతం బొగ్గు, మైనింగ్, లాజిస్టిక్స్, విద్యుదుత్పత్తి, విద్యుత్ పంపిణీ, గ్రీన్ ఎనర్జీ, ఎయిర్పోర్టులు, డేటా సెంటర్లు, సిమెంట్ వంటి వివిధ రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం బ్లూమ్బెర్గ్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో టాప్-10లో గౌతమ్ అదానీ చోటు దక్కించుకున్నారు. ఈ విషయంలో ముకేశ్ అంబానీ కంటే ఒక్క అడుగు ముందున్నారు. ఈ ఒక్క ఏడాదే అదానీ సంపద 15 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. ఇలా అదానీ గ్రూప్ అభివృద్ధికి కృషి చేసిన గౌతమ్ అదానీ..తన 60వ పుట్టిన రోజు సందర్భంగా ఇలా భారీ విరళం ప్రకటించారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
On our father’s 100thbirth anniversary & my 60thbirthday, Adani Family is gratified to commit Rs 60,000 cr in charity towards healthcare, edu & skill-dev across India. Contribution to help build an equitable, future-ready India. @AdaniFoundation pic.twitter.com/7elayv3Cvk
— Gautam Adani (@gautam_adani) June 23, 2022