చిన్నపాటి అపార్థాల, అవగాహన లోపాలతో చాలా అనర్ధాలు జరగుతుంటాయి. వీటి కారణంగా కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం పోతుంటాయి. ఈ అపార్థాల కారణంగా తాజాగా కొందరు సాధువుల ప్రాణాలు పోయినంత పని జరిగింది. దైవ దర్శనానికి వెళ్తున్న సమయంలో ఓ నలుగురు సాధువులను.. పిల్లలను ఎత్తుకుపోయే ముఠాగా అనుమానించి.. గ్రామస్థులు చితకబాదారు. వారు ప్రయాణిస్తున్న వాహనంలో నుంచి దించి మరీ కర్రలతో దారుణంగా కొట్టారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ఉత్తర్ ప్రదేశ్ కు మథురలోని శ్రీ పంచనం జునా అఖాడాకు చెందిన నలుగురు సాధువులు దేశంలోని పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో కర్ణాటకలోని బీజాపూర్ వెళ్లి.. అక్కడి నుంచి పండరీపురానికి కారులో బయలు దేరారు. అయితే వీరు ఈ ప్రాంతాన్నికి కొత్త కావడంతో మార్గంపై సరైన అవగాహన లేదు. దీంతో మార్గం మధ్యలో మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని లవంగా అనే గ్రామానికి చెందిన ఓ బాలుడిని రహదారి గురించి అడిగారు. ఈ క్రమంలో పిల్లవాడితో సాధువులు మాట్లాడటం కొందరు గ్రామస్థులు గమనించారు. ఈక్రమంలో సాధువులపై గ్రామస్థులకు అనుమానం వచ్చి పలు ప్రశ్నలు అడిగారు. ఒకరి భాష మరొకరికి అర్దం కానీ కారణంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. నలుగురు సాధువులను పిల్లలు ఎత్తుకుపోయే ముఠాగా అపార్థం చేసుకుని.. స్థానికులంతా కలిసి కర్రలతో దాడికి పాల్పడ్డారు.
కారులో నుంచి దించి మరి కర్రలతో కొట్టారు. మరికొందరు బెల్ట్ తో సాధువులను చావబాదారు. అయితే ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ..ఆ ప్రాంతాన్నికి చేరుకున్నారు. ఇరువర్గాలను పోలీస్టేషన్ కి తరలించి సమగ్ర విచారణ చేపట్టారు. ఆ విచారణలో ఆ నలుగురు నిజమైన సాధువులేనని పోలీసులు తేల్చారు. వీరంతా మథురలోని శ్రీ పంచనం జునా అఖాడాకు చెందిన సాధువులని పోలీసులు వెల్లడించారు. తమను గ్రామస్థులు అపార్థం చేసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని సాధువులు తెలిపారు. తాము కూడా అవగాహన లోపం వల్లే దాడి చేశామని, తమని క్షమించాలని గ్రామ ప్రజలు తెలిపారు. అయితే ఇరువర్గాల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.