జాతీయ కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. మంగళూరులో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది జులైలో ఇంట్లో యోగా చేస్తున్న సందర్భంగా ఆయన కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన మెదడులో రక్తం గడ్డకట్టింది.. వెంటనే ఆయనను ఐసీయూలో చేర్చారు. గడ్డకట్టిన రక్తాన్ని తొలగించేందుకు ఆయనకు సర్జరీ నిర్వహించారు.
ఆ రోజు నుంచి వైద్యులు రొటీన్ డయాలసిస్తో పాటు రెగ్యులర్ చెకప్లు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మృత్యువుతో పోరాటం చేస్తూ ఈరోజు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య బ్లోసమ్ ఫెర్నాండెజ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు. 1941 మార్చి 27న ఉడుపిలో ఆస్కార్ ఫెర్నాండెజ్ జన్మించారు. ఆయన తండ్రి రోక్ ఫెర్నాండెజ్ గొప్ప ఉపాధ్యాయుడిగా పేరుగాంచారు.
తొలినాళ్లలో ఎల్ఐసీ ఏజెంట్ గా ఆస్కార్ ఫెర్నాండెజ్ పని చేశారు. మొదటి నుంచి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ఆయన తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా చేరి, అంచెలంచెలుగా ఎదిగి పార్టీలో కీలక నేతల్లో ఒకరిగా ఎదిగారు. నాలుగుసార్లు ఎంపీగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.