కేరళాలో భారీ విషాదం చోటు చేసుకుంది. మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్(25), రన్నరప్ అంజనా షాజన్(26)ప్రమాదంలో దుర్మరణం చెందారు. సోమవారం ఎర్నాకుళం బైపాస్లోని హాలిడే ఇన్ ముందు తెల్లవారుజామున ఒంటి గంటకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారులో ప్రయాణిస్తున్నమరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రులకు ఎర్నాకులం మెడికల్ సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
2019 సంవత్సరంలో మిస్ కేరళగా అన్సీ కబీర్, రన్నరప్ గా అంజనా షాజన్ గా గెలుపొందారు. అన్సీ తిరువనంతపురం అట్టింగల్ లోని అలంకోడ్ కు చెందిన వారు కాగా… అంజనా స్వస్థలం త్రిసూర్. ప్రమాదం జరగ్గానే తీవ్ర గాయాలతో స్పాట్లోనే వీరిద్దరూ మృతిచెందారు. అన్సీ, అంజనా మృతదేహాలను మార్చురీకి తరలించారు.
ప్రయాణానికి కాసేపటి ముందే అన్సీ..తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ‘ఇట్స్ టైమ్ టు గో’అంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. అయితే దురదృష్టవశాత్తూ ఆమె పోస్ట్ చేసిన కాసేపటికి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.