వ్యవసాయం చేసి అప్పులపాలైన రైతుకు టమాట పంట కాసులు కురిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ధర పలుకుతూ లక్షల ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. దీంతో టమాటా పండించే రైతు కళ్లల్లో ఆనందం నిండుతోంది.
కొద్ది రోజుల నుంచి దేశంలో ఏ మూలన చూసిన టమాటా ధరల గురించి చర్చ నడుస్తోంది. కనీ వినీ ఎరుగని రీతిలో టమాటా ధరలు అమాంతం పెరిగి వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటే మరోవైపు కూరగాయల ధరలు పెరిగి సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇదే సమయంలో టమాటాలు ఒకరికి మోదం, మరొకరికి ఖేదంలా మారాయి. ఆకాశాన్నంటుతున్న టమాటా ధరలతో వినియోగదారులు విచారం వ్యక్తం చేస్తుంటే, రైతన్నలకు మాత్రం వరంలా మారాయి. టమాటా సాగుతో ఒక్కరోజులోనే లక్షాధికారి అయ్యాడు ఓ రైతు. కష్ట నష్టాలకు ఓర్చి టమాటా పండించిన రైతుకు తగిన ప్రతిఫలం దక్కింది. ఒక్కరోజులోనే లక్షల ఆదాయం రావడంతో ఆ రైతు కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది. వివరాల్లోకి వెళ్తే..
టమాటాలు విలువైన వస్తువుల జాబితాలో చేరిపోయాయి. టమాటాలు కొనాలంటేనే ఆలోచించే పరిస్థితి నెలకొంది. ఏకంగా కిలో టమాటాకు రూ. 150 నుంచి రూ. 200కు పైగానే ధర పలుకుతోంది. కాగా కర్ణాటకకు చెందిన కొందరు టమాట పండించే రైతులకు సిరుల వర్షం కురుస్తోంది. టమాటాలు అమ్మి ఒక్కరోజులోనే రూ. 38 లక్షలు సంపాదించాడు. రెండ్రోజుల క్రితం కోలార్ కు చెందిన ఓ రైతు రెండువేల టమాటా బాక్సులను మార్కెట్ లో అమ్మగా ఒక్కో బాక్స్ రూ. 1900 ధర పలికిందని, దీంతో ఆ రైతుకు రూ. 38 లక్షల ఆదాయం వచ్చినట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ తన నివేదికలో వెల్లడించింది.
బేథమంగళ ప్రాంతానికి చెందిన ప్రభాకర్ గుప్త అతని సోదరుడు నలబై ఎకరాల్లో టమాటా పండిస్తున్నారు. గతంలో బాక్స్ కు రూ. 800 వచ్చేదని ఇప్పుడు మాత్రం సుమారు రెండువేలు పలుకుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూలై 11న 15 కిలోల టమాట బాక్స్ రూ. 1900 ధర పలికి రికార్డ్ సృంష్టించిందని వారు తెలిపారు. ఇదే విధంగా ఇంక కొన్ని రోజులు టమాటా ధరలు కొనసాగితే రైతు పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుందని పలువురు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టమాట ధరలను తగ్గించి, సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు సాధ్యమైన అన్ని చర్యలను తీసుకుంటున్నాయి.