ఈ మద్య కాలంలో కొంతమంది మోసగాళ్ళు రక రకాల పద్దతుల్లో ఎదుటి వారిని మోసం చేస్తున్నారు. సైబర్ నేరాల గురించి తెలిసిందే.. ఈజీ మని వస్తుందని మభ్యపెట్టి బాధితులను లక్షల్లో ముంచేస్తున్నారు. సాధారణంగా కొంత మంది పోలీసులం అని చెప్పి దోచుకోవడం, మోసాలు చేయడం చూస్తుంటాం. తీరా వాళ్లంతా నకిలీ పోలీసులని లబో దిబో అంటుంటారు. బీహార్ లో ఓ దొంగల ముఠా ఏకంగా ఓ నకిలీ పోలీస్ స్టేషన్ తెరిచి దందాలు చేయడం ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే..
బాంకా జిల్లాకు చెందిన భోలా యాదవ్ అనే వ్యక్తి పోలీసు ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి తెగబడ్డాడు. ఇందుకోసం ఒక గెస్ట్ హౌజ్ ని నకిలీ పోలీస్ స్టేషన్ గా మార్చాడు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా కొంత మందికి రూ. 500 రోజు ఇస్తూ వారికి యూనీఫామ్ లు ఇచ్చాడు. దాంతో పాటు నాటు తుపాకులు కూడా ఇచ్చాడు. అంతేకాదు ఒక డీఎస్పీ కూడా నియమించాడు. మొత్తానికి భోలా యాదవ్ ర్యాంక్ బ్యాడ్జీలు ఉన్న పోలీస్ యూనిఫాంతో పాటు తుపాకీలతో పోలీస్ స్టేషన్ కలరింగ్ ఇస్తూ అందరినీ మోసం చేయడం ప్రారంభించాడు.
అక్కడ ఉన్నది ఫేక్ పోలీస్ స్టేషన్ అన్న విషయం తెలియక కొంత మంది ఫిర్యాదులు చేయడానికి వస్తే.. వారి నుంచి డబ్బులు వసూలు చేయడంతో పాటు పోలీస్ ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేయడం మొదలు పెట్టాడు. ఇలా ఎనిమిది నెలల పాటు తన దంగా కొనసాగించాడు. అయితే ఈ నకిలీ పోలీస్ స్టేషన్ కి కొద్ది దూరంలో అసలు పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడ డ్యూటీలో ఉన్న శంభు యాదవ్ నాటు తుపాకులతో ఉన్న నకిలీ పోలీసులను చూశాడు. వాళ్ల తీరు చూసి అనుమానం వచ్చి ఆరా తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
మొత్తానికి ఎనిమిది నెలల తర్వాత నకిలీ పోలీస్ స్టేషన్ గుట్టు రట్టు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు మహిళతతో పాటు ముఠాలోని ఆరుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కీలక సూత్రదారి అయిన భోలా యాదవ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీస్ అధికారి శ్రీవాస్తవ తెలిపారు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.