వైద్యరంగం సాంకేతికంగా కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నో అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితం బెంగళూరులో తెగిపడిన మర్మాంగాన్ని బాలుడికి అతికించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఇప్పటికీ ఆపరేషన్ చేసి కడుపులో కత్తులు కటార్లు వదిలేస్తున్న వైద్యులు ఉండనే ఉన్నారు. తాజాగా ఓ వైద్యుడు మహిళకు పురుడుపోసి కడుపులో టవల్ వదిలేశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన వెలుగు చూసింది. మోహ్రానా ప్రాంతంలో నివాసముండే నజ్రానా అనే మహిళలకు నెలలు నిండి నొప్పులు వచ్చాయి. తీవ్ర ప్రసవ వేదనతో ఉన్న నజ్రానాను భర్త సైఫీ నర్సింగ్ హోమ్ లో చేర్పించాడు. అక్కడ వైద్యుడు మత్లూబ్ ఆపరేషన్ చేసి ఆమెకు ప్రసవం చేశాడు. అక్కడి దాకా అంతా బాగానే ఉంది. కానీ, శస్త్ర చికిత్స సమయంలో ఆస్పత్రి నిర్లక్ష్యంగా వ్యవహిరించింది. నజ్రానా కడుపులో ఓ టవల్ ని ఉంచి కుట్లేశారు. డెలివరీ తర్వాత నజ్రానాకు తీవ్రంగా చలి, కడుపు నొప్పి రావడంతో బయట వాతావరణం చల్లగా ఉండటం వల్ల అలా జరుగుతోందంటూ ఐదురోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచాడు.
తర్వాత కూడా భార్యకు తీవ్రంగా కడుపునొప్పి రావడంతో భర్త ఆమెను మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ అసలు విషయం వెలుగు చూసింది. తర్వాత మరో సర్జరీ చేసి వైద్యులు ఆ టవల్ ను బయటకు తీశారు. స్థానికంగా ఈ టవల్ వ్యవహారం కలకలం రేపింది. ఈ ఘటనపై వైద్యాధికారి రాజీవ్ సింఘాల్ స్పందించారు. దర్యాప్తు జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ వెల్లడించారు. మరోవైపు అసలు సైఫీ ఆస్పత్రికి ఎలాంటి అనుమతులు లేవనే వార్త భయాందోళనకు గురి చేస్తోంది. ఆపరేషన్ సమయంలో వైద్యులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.