న్యూ ఢిల్లీ- భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతలా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆకాశాన్నంటుతున్న చమురు ధరలతో సామాన్య, మధ్య తరగతి జనం బెంబేలెత్తిపోతున్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అసలు వాహనం బయటకు తీయాలంటేనే అంతా వణికిపోతున్నారు. వెంటనే చమురు ధరలు తగ్గించాలని దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది.
ఇదిగో ఇటువంటి సమయంలో చమురు కంపెనీలు వినూత్న ప్రణాళికలతో వినియేగదారుల ముందుకు వస్తున్నాయి. మనం ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ కావాలంటే ఖచ్చితంగా పెంట్రోల్ బంక్ కు వెళ్లాల్లిందే కదా. కానీ ఇకపై ఆ ఆవసరం ఉండదు. ఎందుకంటే చమురు కంపెనీలే మనకు కావాల్సిన డీజిల్ ను మన ఇంటి వద్దకే వచ్చి పోస్తున్నాయి.
అవును మీరు విన్నది నిజమే. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డోర్ స్టెప్ డీజిల్ సర్వీసులను ప్రారంభించింది. ఇందుకోసం కోసం ఐఓసీఎల్, హమ్ సఫర్ ఇండియా స్టార్టప్ తో ఒప్పందం కుదుర్చుకుంది. వీరిద్దరి భాగస్వామ్యంలో భాగంగా ఇకపై డీజిల్ మన ఇంటి వద్దనే పొందొచ్చు. ఐతే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ప్రాంతాల్లోనే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
కనీసం 5 లీటర్ల నుంచి 20 లీటర్లలోపు వరకు డీజిల్ ఇంటి వద్దకే డెలివరీ పొందొచ్చు. ఢిల్లీ, మహరాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణ, అస్సాం, కేరళ, గుజరాత్, గోవాలో ఈ హోమ్ డెలివరీ డీజిల్ సేవలు అందుబాటులో ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. ఫ్యూయెల్ హమ్ సఫర్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని, ఆ యాప్ ద్వార డీజిల్ ఆర్డర్ ఇవ్వాలి.
ఈ డీజిల్ హోమ్ డెలివరీ వల్ల చిన్న పరిశ్రమలు, మాల్స్, హాస్పిటల్స్, బ్యాంకులు, కన్స్ట్రక్షన్ సైట్స్, రైతులు, మొబైల్ టవర్స్, ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ వంటి వాటికి ఉపయోగం ఉంటుంది. దేశంలోని మిగతా ప్రాంతాల్లోను త్వరలోనే ఈ సర్వీసును ప్రారంభించేందుకు కంపెనీలు ఏర్పాట్లు చేస్తోంది.