వెహికిల్ స్క్రాపింగ్ పాలసీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లో వెహికల్ స్క్రాపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో వర్చువల్గా పాల్గొన్న మోదీ కొత్త విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఫిట్నెస్ పరీక్షలో ఫెయిలయ్యే వాహనం ఇకపై తుక్కుగా మారిపోతుంది. ఈ మేరకు కేంద్రం కార్యాచరణ మొదలుపెట్టింది. 1 ఏప్రిల్ 2023 నుంచి వాణిజ్య వాహనాలు, 1 జూన్ 2024 నుంచి వ్యక్తిగత వాహనాలకు ఇది వర్తిస్తుంది.
ఫిట్నెస్ పరీక్షలో కనుక వాహనాలు విఫలమైతే నెల రోజుల్లోపు మరో అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత కూడా విఫలమైతే వారం రోజుల్లోపు అప్పీలు చేసుకోవచ్చు. అక్కడ ఫిట్నెస్ పరీక్షలో విఫలమైతే నమోదిత కేంద్రంలో వాహనాన్ని తుక్కు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో 15 ఏళ్ల సర్వీసు పూర్తయిన వాహనాలు కోటికిపైనే. వీటిని తుక్కు చేయడమే కొత్త విధానం ఉద్దేశం. వాటి స్థానంలో కొత్త వాహనాలు వస్తే భద్రత పెరగడంతోపాటు ఇంధనం, నిర్వహణ ఖర్చులు ఆదా అవుతాయి.
అంతేకాకుండా ఈ విధానం వల్ల కొత్తగా 35 వేల ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వానికి రూ. 10 వేల కోట్ల ఆదాయం వస్తుంది. కొత్త విధానంలో కొన్ని ప్రోత్సాహకాలను కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత వాహనం రిజిస్టర్డ్ స్క్రాపింగ్ సెంటర్కు వెళ్తే వాహన యజమానికి డిపాజిట్ ధ్రువపత్రం లభిస్తుంది. కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు దానిని చూపిస్తే రిజిస్ట్రేషన్ రుసుము నుంచి మినహాయింపు లభిస్తుంది.
మరోవైపు తుక్కుగా మార్చి కొత్త వాహనాలకు వెళ్తే వాటి కొనుగోళ్లపై రాయితీలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు, వ్యక్తిగత వాహనాలకైతే రోడ్డు ట్యాక్స్పై 25 శాతం, వాణిజ్య వాహనాలకు 15 శాతం రాయితీ లభిస్తుంది. వాణిజ్య వాహనాలకు 8 సంవత్సరాల వరకు, వ్యక్తిగత వాహనాలకు 15 ఏళ్ల వరకు ఈ రాయితీ లభిస్తుంది. ప్రతి జిల్లాలోను ఓ తుక్కు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు.