దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఢిల్లీలో రోజురోజుకూ ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కొరత కారణంగా డాక్టర్ సహా 8 మంది రోగులు మరణించారు. ఢిల్లీలో బాత్రా ఆసుపత్రిలో కొంతకాలం ఆక్సిజన్ అయిపోవడంతో ఎనిమిది మంది రోగులు మరణించారని ఢిల్లీలోని బాత్రా హాస్పిటల్ శనివారం తెలిపింది. ఆక్సిజన్ కొరతతో మరణించిన వారిలో డాక్టర్లలో ఒకరు ఉన్నారని ఆసుపత్రి ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.
మరోవైపు కోవిడ్ సంక్షోభంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఉదయం 11.45 గంటలకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయిందని, మధ్యాహ్నం 1.30 గంటలకు ఆక్సిజన్ వచ్చిందని ఆసుపత్రి యాజమాన్యం కోర్టుకు వెల్లడించింది.మరణించిన డాక్టర్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ ఆర్కే హిమంథానిగా గుర్తించారు. 230 మంది 80 నిమిషాల సేపు ఆక్సిజన్ లేకుండా ఉన్నట్లు సమాచారం.
సరిగ్గా కొద్దిసేపటిక్రితం కర్నూలులోని కేఎస్ కేర్ అనే ప్రైవేట్ ఆస్పత్రిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఆక్సిజన్ అందక ఆరుగురు మృతి చెందారు. తమకు ఆక్సిజన్ అందడం లేదని రోగులు ఎంత మొత్తుకున్నా ఆస్పత్రి సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదని బంధువులు ఆరోపించారు. అయితే విచారణలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే ఈ ఆస్పత్రిలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు తేలింది.