కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో విషాదం చోటుచేసుకుంది. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి గుండెపోటుతో మరణించారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్ర ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు యాత్రలో పాల్గొన్నారు. సంతోక్ సింగ్ చౌదరి కూడా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. పంజాబ్ లోని ఫిలోవర్ వద్ద రాహుల్ గాంధీతో కలిసి యాత్ర చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు.
అయితే వెంటనే అక్కడే ఉన్న ఇతర నాయకులు, పార్టీ కార్యకర్తలు ఆయన్ను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అంబులెన్స్ లో ఆస్పత్రికి వెళ్తుండగా మార్గం మధ్యలోనే ఆయన ప్రాణాలు వదిలారు. సంతోక్ సింగ్ ప్రస్తుతం జలంధర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పంజాబ్ రాష్ట్ర మంత్రిగాను ఆయన పనిచేశారు. సంతోక్ సింగ్ మృతిపై ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంపీ మృతితో ఆయన కుటుంబ సభ్యులు , అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరి.. ఎంపీ మృతిపట్ల మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.