పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. అందుకే ఈ వేడుకను ఘనంగా జరుపుకునేందుకు యువత ఎంతో ఆసక్తి చూపిస్తుంది. అందులో భాగంగా పెళ్లిలో డ్యాన్స్, మ్యూజిక్ లను ఏర్పాటు చేస్తారు. అంతేకాక బాణాసంచాలు కాలుస్తూ తెగ సందడి చేస్తుంటారు. అయితే ఝార్ఖండ్ లోని ధన్ బాధ్ జిల్లాలోని ముస్లిం మతపెద్దలు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పెళ్లిళ్లలో డ్యాన్సులు చేయడం, పెద్ద శబ్ధాలతో మ్యూజిక్ పెట్టడం, పటాకులు కాల్చడాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటివి ఇస్తామిక్ సంప్రదాయాలకు వ్యతిరేకమని వారు తెలిపారు. ఈ ఆదేశాలను ఎవరైన అతిక్రమిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సోమవారం ఝార్ఖండ్ లోని ధన్ బాధ్ జిల్లాలో నిర్సా బ్లాక్ లో ఉన్న సిబిలిమడీ జామా మసీదు ప్రధాన ఇమామ్ మౌలానా మసూద్ అక్తర్ తో పాటు కొందరు మత పెద్దలు సమావేశం అయ్యారు. ఈ క్రమంలో పెళ్లిళ్లలో జరిగే కొన్ని కార్యక్రమాలపైన ఆంక్షలు విధించారు. వివాహాల్లో డ్యాన్సులు, డీజేలు, టపాసులు పేల్చడం వంటివి నిషేధిస్తునట్టు మసూద్ అక్తర్ తెలిపారు. ఈ ఆంక్షలు డిసెంబరు 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని అన్నారు. ఇస్లాం మత సంప్రదాయాలకు అనుగుణంగా పెళ్లిళ్లు జరగాలని.. అందుకోసమే తాము ఈ ఆంక్షలను ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కొత్త ఆంక్షల నేపథ్యంలో ఇక నుంచి నిఖా(పెళ్లి)లో డ్యాన్సులు వేయరాదని, మ్యూజిక్ పెట్టకూడదని, బాణ సంచా పేల్చరాదని పేర్కొన్నారు.
ఎవరైనా ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మత పెద్దల ఆదేశాలను ఉల్లంఘించే వారిపై రూ.5,100 జరిమానా విధిస్తామని మసూద్ తెలిపారు. ఇస్లాం మతంలో పాశ్చాత్య సంస్కృతి సంబంధించిన డ్యాన్స్ లు, డీజే మ్యూజిక్ లు వంటి వాటికి తావులేదన్నారు. అంతేకాక పెళ్లిళ్లలో ఇలాంటి వి ఏర్పాటు చేయడం వలన ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందన్నారు. అంతేకాక రాత్రి 11 తరువాత వివాహం జరిపించినా కూడా జరిమానా తప్పదంట. ఈ ఆంక్షలు కాదని ఎవరైన పెళ్లళ్లలో మ్యూజిక్ , డ్యాన్స్ లు వంటివి ఏర్పాటు చేస్తే.. జరిమానాతో పాటు లిఖిత పూర్వకంగా క్షమాపణలు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఈ సమాచారం తెలియని వాళ్లకి తెలియజేయాలని ఇమామ్ సూచించారు.