ఆ 59 ఏళ్ళ మహిళ ఇంట్లోనే ప్రత్యేక కిచెన్ నిర్వహిస్తూ నెలకు రూ.70వేలు సంపాదిస్తోంది. ముంబైలో గత రెండేళ్ల కిందట తన బంధులందరి కోసం ఆమె ప్రత్యేక వంటకాలు చేసింది. దీంతో వారికి ఆ వంటలు ఎంతో నచ్చాయి. వారు ఆమెను సొంతంగా కిచెన్ నిర్వహిస్తే బాగుంటుందని ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే ఆమె పెరిమాస్ కిచెన్ను ప్రారంభించింది. ఆ కిచెన్ ద్వారా వంటలు వండుతూ ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుంటూ మీల్స్, ఇతర వంటకాలను డెలివరీ చేస్తోంది. ఆమె ముంబైకి చెందిన మీనా సుబ్రమణియన్. ఆమె వండే మీల్స్ ఎంత రుచికరంగా ఉంటుందంటే ఆమె ప్రతి సోమవారం తన మీల్స్లో ప్రత్యేక వంటలను అందిస్తుంది. ఆ మీల్స్ కోసం శనివారం ఉదయాన్నే ఆర్డర్ పెట్టాలి. 30 నిమిషాల పాటు మాత్రమే ఆర్డర్. 40 వరకు మీల్స్కు ఆర్డర్ తీసుకుంటుంది. మీనా అందించే ఒక్క మీల్స్ ధర రూ.800 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. దాన్ని ఇద్దరు లేదా ముగ్గురు తినవచ్చు.
ఒక్కో మీల్లో కొబ్బరితో తయారు చేసిన కర్రీ, పాపడాలు, ఊరగాయ, మజ్జిగ లేదా పెరుగు, అన్నం, సలాడ్, తీపి వంటకం, రసం, సాంబార్ వంటి పలు భిన్న వంటలు ఉంటాయి. ఇక ముందస్తు ఆర్డర్లు పెడితే కేవలం 30 నిమిషాల్లోనే ఆర్డర్స్ అయిపోతాయి. మళ్లీ ఇంకో రోజు వెయిట్ చేయాల్సిందే. ఆమె వండే వంటల్లో బిసీ బెలీ బాత్, అవియాల్, పాయసం, రసం వడ, చింతపండు ఇడ్లీ వంటివి ప్రధానమైనవి. తన తల్లి నుంచి వంటలను వండడం నేర్చుకున్నానని, తనను ఇంత బాగా ఆదరిస్తారని అనుకోలేదని మీనా చెబుతోంది.