అసంఘటిత కార్మికుల కోసం కేంద్రం ఎప్పుడూ కొత్త పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తూనే ఉంటుంది. తాజాగా అసంఘటిత రంగ కార్మికులను ఆదుకునేందుకు కేంద్రం కొత్త కార్యక్రమంతో ముందుకొచ్చింది. ‘ఇ-శ్రమ్ పోర్టల్ శ్రమేవ జయతే’ జాతీయ అసంఘటిత కార్మికుల డేటాబేస్ను గురువారం లాంఛనంగా కేంద్రం ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో ఉన్న నిర్మాణ, ఇతర కార్మికుల వివరాలను డేటా బేస్లో స్టోర్ చేయనున్నారు. ఇ-పోర్టల్ ద్వారా ప్రతీ కార్మికుడికి ఆధార్ నెంబర్ తరహాలో 12 నెంబర్ల యూనివర్స్ అకౌంట్ నెంబర్ ఇవ్వనున్నారు. ఇ-శ్రమ్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా 380 మిలియన్ అసంఘటిత రంగ కార్మికుల వివరాలను పొందుపరచనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు.
ఇ-పోర్టల్లో అసంఘటిత కార్మికుల వివరాలు ఉండటం వల్ల ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రయోజనాలను పొందగలరు. సంక్షోభ సమయాల్లోనూ కార్మికులు ప్రయోజనాన్ని కూడా పొందుతారు. భవన నిర్మాణ కార్మికులు కాకుండా, ఇందులో వలస కార్మికులు, చిరు వ్యాపారులు, గృహ కార్మికులు ఉన్నారు. పోర్టల్లో కార్మికులు నేరుగా తమను నమోదు చేసుకోవచ్చు. నమోదు కార్యక్రమంలో సహాయం కోసం జాతీయ టోల్ ఫ్రీ నంబర్ 14434 కూడా ఏర్పాటు చేశారు.